Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాశ్మీరీల హక్కులను కాలరాస్తున్నప్పటికీ.. రైట్ వింగ్ మీడియా మోడీ సర్కారుపై ప్రేమ ఒలకబోస్తున్నది. ఇనుప బూట్ల చప్పుళ్లు, లాఠీలు, పెల్లెట్లతో దమనకాండ జరుగుతున్నప్పటికీ.. సీతాకోక చిలుకల సవ్వడి, హరివిల్లు విరిసిన అద్భుత స్వర్ణయుగానికి ప్రధాని మోడీ నేతృత్వం వహిస్తున్నట్టుగానే అభూత కల్పనలు చిత్రిస్తున్నది మితవాద మీడియా. నిర్దాక్షిణ్యంగా విద్వేషపూరిత వదంతులను ప్రచారం చేస్తున్నది. రైట్వింగ్ ట్విట్టర్ గతవారం ముస్లింలపై ద్వేషాన్ని చిమ్మింది. బారుకాట్ ఆల్ ముస్లిం అంటూ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేసింది. రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచే కార్యకలాపాలు, ఉదాహరణకు ఈ ట్వీట్ను ప్రచారం చేయడం ఐపీసీలోని 153(ఏ) కింద చట్టవిరుద్ధం. ఈ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్న ఖాతాదారులను అనుసరిస్తున్నవారిలో కేంద్రమంత్రులు, పీఎం కూడా ఉండటం విశేషం. ఆర్టికల్ 370 గురించి ఎక్కడా ప్రస్తావించరాదని బాండ్ పేపర్పై సంతకం చేసుకుని నిర్బంధించిన కాశ్మీరీలను సర్కారు మొన్న విడుదల చేసింది. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాశ్మీర్లో కాలరాసినప్పటికీ మోడీ సర్కారుపై మితవాద మీడియా సంస్థలు గొప్పగా రాశాయి. రామజన్మ భూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసిన నేపథ్యంలో స్వరాజ్య ఎడిటోరియల్ డైరెక్టర్ జగన్నాథన్.. మరోచోటైనా మసీదులు నిర్మించే అవకాశాన్ని ముస్లింలకు ఎందుకు ఇవ్వాలనీ, ఇది నాగరిక న్యాయం కాదని మైనార్టీలపై ద్వేషాన్ని వెళ్లగక్కారు. ఓవైపు మానవ హక్కులను హరిస్తుంటే.. ఆ నిరంకుశ చర్యలను నిస్సిగ్గుగా సమర్థిస్తూ రాజకీయ ద్వేషాన్ని ప్రచారం చేసే బాధ్యతను ఈ మీడియా నెత్తికెక్కించుకుంది. అలాగే, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ సందర్భంగా తమిళనాడులోని మామళ్లపురం చేరిన మోడీ బీచ్లో చెత్త ఏరిన వీడియోపైనా ప్రశంసలు కురిపించింది. మోడీని చిత్రించేందుకు కెమెరామెన్ల పాట్లు, ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపేయాలని చెబుతూ.. ప్లాస్టిక్ బ్యాగ్నే పట్టుకుని చెత్తకోసం తిరగడంపైనా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.