Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పోలియో వాక్సిన్లు (ఓపీవీ) అందించే కార్యక్రమంపై సమీక్ష జరపాలని వైద్య నిపుణులు కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ అందుకు సుముఖంగా లేనట్టు సమాచారం. పోలియో వ్యాధి రాకుండా పిల్లలకు మూడు రకాల పోలియో వ్యాక్సిన్లను అందజేస్తున్నారు. వాటిల్లో టైప్-2 వ్యాక్సిన్ను 2016 నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే నోటి ద్వారా అందచేసే వ్యాక్సిన్ల వల్ల పోలియో వ్యాధికారక దుష్పప్రభావాలు సంభవిస్తున్నాయని పలువురు నిపుణులు సూచించిన క్రమంలో 40కి పైగా దేశాలు ఈ విధానాన్ని ఉపసంహరించకున్నాయి.
పోలియో నిర్మూలన విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు, భారత ప్రభుత్వానికి ఇంతకుముందు సూచనలందించిన టి.జాకబ్ జాన్.. పోలియో చుక్కల (ఓపీవీ) నిరంతర వినియోగాన్ని ప్రస్తావిస్తూ దీనిని 'నైతిక క్రమరాహిత్యం'గా అభివర్ణించారు. ఇది వాడటం మూలాన పక్షవాతం వంటి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని ఆయన వివరించారు. ఆరేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం 1994లో ప్రారంభించింది. 2011లో దేశంలో పూర్తిగా పోలియో అంతరించిపోయిందని కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ 2015 నుంచి ఇంజెక్టు చేయగల పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రెండు కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
అయితే పోలియో చుక్కల ద్వారా వస్తున్న ప్రతికూల ప్రభావాలను గురించి కేంద్రం వివరాలను ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని పలువురు శాస్త్రవేత్తలతోపాటు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఎమెరిటస్ ప్రొఫెసర్ జాన్ అన్నారు.