Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ రూపంలోనైనా హింస ఆమోదయోగ్యం కాదు
- ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారనుకోవడం పొరపాటే
- మీడియాతో సీపీఐ(ఎం) నేత మహ్మద్ యూసఫ్ తరిగామి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కాశ్మీర్ను శ్మశానవాటికగా మార్చొద్దని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ తరిగామి కోరారు. కాశ్మీర్లో జర్నలిస్టులు తమ పని చేయడం చాలా కష్టమని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తరిగామి కాశ్మీర్లో పలుసార్లు ఉగ్రవాదుల దాడికి గురైన సంగతి తెలిసిందే. ఆయన వైద్య చికిత్స నిమిత్తం రెండోసారి ఢిల్లీలోని ఎయిమ్స్కు వచ్చారు. ఈ సందర్భంగా బుధవారం నాడిక్కడ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని సమాఖ్య మూలాలు దాడికి గురయ్యాయని తరిగామి వ్యాఖ్యానించారు. కాశ్మీర్ను జైలుగా మార్చి దాదాపు 80 రోజులు అయిందని, కాశ్మీర్ లోయలో ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయిందని, పాఠశాలలు, కాలేజీలు తెరిచినా, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రజానీకం తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని, యువత కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఏ రూపంలోనైనా హింస ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ నేతలు ప్రధాన స్రవంతి అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారా లేేక వేర్పాటువాద దృక్పథంతో ఉన్నారా, అవమానానికి గురయ్యారని భావిస్తున్నారా అన్నది తెలుసుకోవాలన్నారు.
ప్రజలను మోసగిస్తున్న ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలు
ఆర్టికల్ 370 రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు మద్దతు లభిస్తోందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు, ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థల ద్వారా ప్రజలను మోసగిస్తున్నారని తరిగామి పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ద్వారా అప్పటి జమ్మూకాశ్మీర్ రాజ్యం భారతదేశంలో చేరిందని, కానీ ఆరెస్సెస్, దాని అనుబంధ సంఘాలు దీనిని దేశ ప్రయోజనాలకు హానికరంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ, ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాశ్మీరీలు ఎందుకు పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేయడం లేదన్న ప్రశ్నకు తరిగామి స్పందిస్తూ ''తీహార్ జైలులో మీరు ఎన్ని నిరసనలు చూశారు?. కాశ్మీర్ను ఒక జైలుగా మార్చారు. లోయలో హోటళ్లు, గెస్టుహౌస్లు ప్రజలతో జైళ్లుగా మారాయి'' అని తెలిపారు. ''నిశ్శబ్దం అంగీకారం కాదు. దీనిని నమ్మడం పొరపాటు అవుతుంది'' అని పేర్కొన్నారు. కాశ్మీర్లో ఈ శాసనోల్లంఘన ఎంతకాలం కొనసాగుతుందని అడినప్పుడు ''ఒక విషాదాన్ని ఎదుర్కొన్న వ్యక్తిని కన్నీళ్లు ఎంతసేపు ప్రవహిస్తాయో మీరు అడుగుతారా? మీరు అలా అడిగితే, అది ద్రోహం చేయడమే కాదు, అవమానించడం కూడా'' అని చెప్పారు.
ఏ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్నారు?
ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేయడం, ఆర్టికల్ 35(ఎ) రద్దు చేయడం వంటి నిర్ణయాలు తీసుకునే ముందు కాశ్మీర్ నాయకులను ఎందుకు సంప్రదించలేదని ఆయన ప్రశ్నించారు. శ్రీనగర్లోని సొంత ఇంట్లో వున్న తనను ఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం లేదని అన్నారు. ప్రముఖ వార్తా పత్రికలు ''ప్రభుత్వ గెజిట్''లుగా మారాయని, లోయలో జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ప్రజాస్వామ్య, లౌకిక భారత దేశాన్ని విశ్వసిస్తున్న రాజకీయ పార్టీలు మౌనం వీడి కాశ్మీరీ ప్రజల కోసం మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సుప్రీం కోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేస్తా : సీతారాం ఏచూరి
తమ పార్టీ నేత మహ్మద్ యూసఫ్ తరిగామి పరిస్థితి స్పష్టం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధ్ధమని తెలిపారు. అక్కడ సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు.