Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : దేశంలో రాజ్యాంగం రోడ్డున పడిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం నిత్యం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ అభద్రతా భావంలోకి బలవంతంగా నెట్టేస్తోందన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగం-పౌర స్వేచ్ఛపై సదస్సు జరిగింది. సంగమం, ఆలిండియా లాయర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా గోపాలగౌడ పాల్గొని ప్రసంగించారు.
రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు గళమెత్తాలన్నారు. దేశ ప్రజల ప్రగతి కోసం రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకున్న మహోన్నత ఉద్దేశాలకు భంగం కలిగిస్తోందన్నారు. నాడు రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ నాటి నేతలు అడిగిన ప్రశ్నలను, లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ అంబేద్కర్ సుదీర్ఘ ఉపన్యాసం చేశారన్నారు. దేశ పౌరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో శ్రమించి విలువలతో కూడిన ఆర్టికల్స్ను పొందుపరచారన్నారు. రష్యా విప్లవం నుంచి స్ఫూర్తిని పొందిన తొలి ప్రధాని నెహ్రూ మన దేశంలో ల్యాండ్ లార్డిజాన్ని నిర్మూలించడానికి పూనుకొని భూ సంస్కరణలు తెచ్చారన్నారు. కానీ నేడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పాలన సాగిస్తోందన్నారు.
రైతుల నుంచి భూములు లాక్కుంటూ వారిని రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కల్పించాల్సిన విద్య, వైద్యం, కూడు, గుడ్డ నేడు అందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వేల కోట్ల ఆస్తులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు శక్తులకు అప్పనంగా అప్పగిస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు రక్షణ కల్పించడానికి బదులుగా వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించే పరిస్థితులను కల్పిస్తున్నారన్నారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడం, కేసులు పెట్టి జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. మత చాందసవాద, నియంతృత్వ దుర్మార్గాలను నిలదీసేందుకు చట్ట సభల్లో వామపక్ష నేతలు ఉండాలన్నారు.
కానీ దురదృష్టవశాత్తు వారి సంఖ్య తగ్గుతుందోని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకర మన్నారు. దేశ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమ న్యాయం కోసం చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల పట్ల ప్రజల్లో చైతన్యం నింపేందుకు తాను దేశ పర్యటను చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. బీజేపీ, దాని అనుబంధ శక్తుల వల్ల తనకు ప్రమాదం పొంచి ఉందని తెలుసు. అయినా పర్యటన చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, సంగమం అధ్యక్షులు బోస్, ఎపీసీఎల్ఎ ప్రధాన కార్యదర్శి పి సురేష్, అడ్వకేట్లు, ప్రజాస్వామ్య వాదులు పాల్గొన్నారు.