Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీకి నష్టాలే రావు...
- ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిందే ఇవ్వటం లేదు..
- ఆర్థిక భారాన్ని పెంచుతున్న డీజిల్పై పన్ను : 2005 నాటి ఐఐఎం-బెంగుళూరు అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : తెలంగాణ ఆర్టీసీ బాగుపడాలంటే, సంస్థ నష్టాల బాట నుంచి బయటపడాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం వల్లే అవుతుంది. ఈ మాట ప్రతిపక్ష నాయకులు, పార్టీలు చెప్పటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఏర్పాటుచేసిన కమిటీ చెబుతోంది. థర్డ్ పార్టీగా ఐఐఎం-బెంగుళూరు వారు ఆర్టీసీ సంస్థపై 2005లో సమగ్ర అధ్యయనం చేయగా, వారు తెలియజేసిన విషయాల్ని తాజాగా ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్న అంశాలు...ఆ సంస్థ పరిధిలోనివి కావనీ, ఇవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే (డీజిల్పై పన్ను, రాయితీలు, సబ్సిడీలు) అంశాలనీ 'ఐఐఎం-బెంగుళూరు' నివేదిక స్పష్టంగా తేల్చింది. సమస్యలు ఏండ్లుగా ఉండిపోవటం వల్లనే సంస్థ ఆర్థికంగా కుంగిపోయిందని నివేదిక పేర్కొన్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థలపై సమగ్ర అధ్యయనం కోసం గత పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు కమిటీల్ని ఏర్పాటుచేసింది. ఐఏఎస్ అధికారులు, మంత్రుల నేతృత్వంలో మూడు కమిటీలు ఏర్పాటుకాగా, థర్డ్ పార్టీగా 'ఐఐఎం-బెంగుళూరు' నేతృత్వంలో నాలుగో కమిటీ ఏర్పాటైంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈ నాలుగు కమిటీలను అప్పటి పాలకులు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. సంస్థ లాభనష్టాలు, ప్రభుత్వం ఇస్తున్నది ఎంత? అన్నవాటిపై వాస్తవ గణాంకాలు బయటకు రావాలని కార్మికసంఘాలు కోరుకున్నాయి.
2005లో ఈ నాలుగు కమిటీలు సంస్థపై అధ్యయనం చేశాయి. ఇందులో ఐఐఎం-బెంగుళూరి వారి అధ్యయనంలో తేలిన అంశాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీకి తీవ్ర నష్టాలు తెచ్చిపెడుతున్న రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి. స్టూడెంట్ పాస్లు, జర్నలిస్టు పాస్లు, సంస్థ ఉద్యోగుల ప్రయాణాలపై రాయితీలు, వివిధ రకాల సబ్సిడీలు...తిరిగి గ్రాంట్ రూపంలో ప్రభుత్వం చెల్లించాలి. కానీ అలా చెల్లించటం లేదు. సామాజిక, సంక్షేమ పథకాలు అమలుజేయటాన్ని ఆర్టీసీ కార్మికులు వ్యతిరేకించటం లేదు. ఆ సబ్సిడీని గ్రాంట్ రూపంలో తిరిగి ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటున్నాయి. ఇది ఆర్టీసీ నిర్వహణకు సంబంధించిన అంశం కాదు. ప్రభుత్వానికి సంబంధించిన అంశం. రాయితీల భారం దింపాల్సింది ప్రభుత్వమే.
లాభాలు వచ్చే మార్గాల్ని ప్రయివేటు బస్సు ఆపరేటర్లకు అప్పజెప్పటం, నష్టాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సుల్ని తిప్పటం..ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే నష్టాలు వచ్చే రూట్లలో ప్రభుత్వ రాయితీలు సంస్థకు పెద్ద గుదిబండలా మారింది. దీనికి తోడు డీజీల్పై పన్ను, మోటార్ వాహనాల పన్ను సంస్థను మరింత ముంచాయి. ఇందులో ప్రధానంగా డీజీల్పై వసూలు చేస్తున్న పన్ను చాలా ఎక్కువగా ఉంది. ఇంధనంపై పన్ను, మోటార్ వాహనాల పన్ను...అంశాలు కూడా ఆర్టీసీ నిర్వహణకు సంబంధించినవి కాదు. వీటి ద్వారా ఏర్పడుతున్న ఆర్థిక భారాన్ని ఆర్టీసీ తప్పించుకోలేదు. కారణం ఇవి ప్రభుత్వ పరిధిలోని అంశాలు.
1993-96 మధ్య నష్టాల్ని తగ్గించుకోవటం కోసం ఉద్యోగ నియామకాల్ని ఆపేశారు. టికెట్ల ధరలను పెంచారు. అయినా సంస్థ లాభాలబాటలోకి వెళ్లలేదు. నష్టాలు మరింత పెరిగాయి. దీనికి కారణమేంటని లెక్కలు చూస్తే...డీజిల్పై పన్ను, వాహనాల పన్ను అని తేలింది. సంస్థను కాపాడాలన్న సదుద్దేశమే ఉండి ఉంటే...ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేయవని ఐఐఎం-బెంగుళూరు నివేదిక స్పష్టంగా తెలిపింది. 1990-2002 మధ్య మోటార్ వాహనాల పన్ను క్రమంగా పెంచుతూ వెళ్లారు. దీంతో రూ.75.06 కోట్లు ఉన్న పన్ను....రూ.337కోట్లకు పెరిగింది. ఆర్టీసీ చెల్లిస్తున్న మోటార్ వాహనాల పన్ను ఐదు రేట్లు పెరిగింది.
'రిపోర్ట్ ఆఫ్ సబ్ గ్రూప్ ఆన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్'(ఎస్ఆర్టీయూ) అనే పేరుతో ప్లానింగ్ కమిషన్ కూడా 2016లో ఒక నివేదిక విడుదల చేసింది. జాతీయ స్థాయిలో దీనిని అధ్యయనం చేసింది. నిత్యం పెరుగుతున్న డీజిల్ ధరలకు, వాటిపై చెల్లిస్తున్న ఇంధనం పన్నుకు అనుగుణంగా టికెట్ల ధరలు పెరగలేదు. వివిధ వర్గాలకు టికెట్ల ధరల్లో ఇస్తు న్న రాయితీలు తిరిగి గ్రాంట్ రూపంలో ప్రభుత్వం నుంచి రావటం లేదు. కేవ లం లాభాపేక్షను దృష్టిలో పెట్టుకోకుండా, మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇవన్నీ కూడా సంస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ప్లానింగ్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా తెలిపింది.