Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : ఏపి రాజధాని నిర్మాణంలో కీలకమైన మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో ప్రాజెక్టు అర్హత లేదని పేర్కొంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించింది. డిపిఆర్లో చూస్తే 2020 నాటికి కూడా జనాభా 10 లక్షలు దాటేటట్లు లేదని, కనీసం 18 లక్షల మందికి పైగా ఉంటేనే ఇవ్వడం సాధ్యమవుతుందని వివరించారు. కేంద్రానికి సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లో నిధుల సమీకరణపై ఎక్కడా స్పష్టతివ్వలేదని పేర్కొన్నారు. ఆర్థికపరమైన విషయాల్లోనూ నిలకడలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 20 శాతం ఇస్తుందని, రాష్ట్రం సమకూర్చాల్సిన 80 శాతం ఎలా సమీకరిస్తారనే విషయంపై వివరణ లేదని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి నెలరోజుల క్రితమే పంపినప్పటికీ బయటకు రానీయలేదు. అయితే విజయవాడ నగర జనాభాను మాత్రమే లెక్కల్లో పేర్కొంటున్నారని, రాజధాని ప్రాంతం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే జనసంఖ్య అంతకు రెట్టింపవుతుందని, అయితే ఈ విషయాన్ని డిపిఆర్లో పేర్కొనలేదని క్రిడా అధికారులు తెలిపారు. ఈ వివరాలతో మరోసారి నివేదికను పంపుతామని అంటున్నారు.