Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : అగ్రిగోల్డ్ ఆత్మ'హత్యల' జాబితాలో మరో ఇద్దరు బాధితులు చేరారు. కష్టపడి కూడబెట్టిన సొమ్ము 'అగ్రిగోల్డ్' పరం కావడంతో ఓ వృద్ధ దంప తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విజయ వాడలో మంగళవారం చోటుచేసుకుంది. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ వర్కుషాపు రోడ్డులోని కొండయ్య హోటల్ సమీపంలో వేదాల వెంకట నారాయణ శర్మ(64), వేదాల సుందరి(52) భార్యాభర్తలు నివాసముండేవారు. శర్మ అకౌంట్లు రాసే పని చేస్తూ జీవనం సాగించేవారు. వీరి కుమారుడు సుబ్బారావు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. దీనికితోడు నారాయణ శర్మ వార్దక్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరికున్న ఇల్లు అమ్మి అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేశారు. ఏడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. 'అగ్రిగోల్డ్'లో దాచిన సొమ్ముపై వచ్చే వడ్డీ డబ్బులే వీరికి జీవనాధారం. ఏడాదిన్నరగా ఆ వడ్డీ సొమ్ము రావడం ఆగిపోయింది. అగ్రీగోల్డ్ కార్యాలయం చుట్టూ తిరిగితిరిగి వారు చేతులెత్తేయడంతో వృద్ధ దంపతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుటుంబం కూడా గడవడం కష్టమైపోవడంతో దంపతులిద్దరూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణానది భవానీఘాట్ వద్ద నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అగ్రిగోల్డ్ సంస్థ నుండి సుమారు రూ. 4 లక్షలు రావాల్సి ఉందని బాధితుల బంధువులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.