Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో వీడని ప్రతిష్టంభన
- మా డిమాండ్లకు ఒప్పుకుంటేనే ఫోన్ చేయండి : ఉద్ధవ్ థాక్రే
- ఫడ్నవీసే సీఎం, శివసేన మద్దతు మాకే : నితిన్ గడ్కరీ
- సేన ఎమ్మెల్యేలు హౌటల్కు తరలింపు..!
- మొదలైన క్యాంపు రాజకీయాలు
ముంబయి : పదిహేనురోజులుగా మహారాష్ట్రలో అధికారం కోసం మిత్ర పక్షాల మధ్య జరుగుతున్న పోరు చివరి అంకానికి చేరుకున్నది. సీఎం కుర్చీని అధిరోహించేది తమ నాయకుడేనని ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రచారాలు చేసుకుంటున్నా.. బీజేపీ-శివసేన కూటమిల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యమంత్రి పదవితో పాటు క్యాబినెట్ పోర్టు పోలియోలూ 50:50 నిష్పత్తిలో పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబడుతుండగా.. బీజేపీ దానికి ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ముంబయిలోని ఆయన నివాసం మాతోశ్రీలో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నరేండ్ల పాటు సీఎం కుర్చీని తమకు ఇస్తామంటేనే తనను కలవాలని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తున్నది. బీజేపీతో మైత్రిని తెంచుకునే ఉద్దేశం తనకు లేదనీ, కానీ ఆ పార్టీ గతంలో చేసిన హామీలనే తాను గుర్తు చేస్తున్నానని ఆయన తెలిపారని సమాచారం.
మరోవైపు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం నాగ్పూర్లోని సంఫ్ు ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ని కలిశారు. ఫడ్నవీస్ను తొలగించి తనను సీఎం చేస్తారనే వార్తలపై ఆయన స్పందిస్తూ.. అవి అవాస్తవమని తెలిపారు. తాను మహారాష్ట్రకు రావడం లేదనీ, ఢిల్లీలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఫడ్నవీసే రాష్ట్ర ముఖ్యమంత్రి అనీ, శివసేన తమకు మద్దతిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. బీజేపీకి చెందిన పలువురు ప్రతినిధులు గురువారం గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. ప్రజలు మహాకూటమికి ఓటేశారని త్వరలోనే శుభవార్త వింటారని వారు భేటీ అనంతరం తెలిపారు. కాగా, శనివారంతో అక్కడ గత ప్రభుత్వపు గడువు తీరిపోనున్న నేపథ్యంలో గవర్నర్ న్యాయ కోవిదుల సూచనలు కోరారు. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయకుండా ఉండేందుకు ఆయన న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నారు.
ఇక శివసేన ఎమ్మెల్యేల భేటీ అనంతరం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు స్పందిస్తూ.. ఉద్ధవ్ నిర్ణయమే తమ నిర్ణయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి ఉద్ధవ్ కలత చెందుతున్నారని ఆయన తెలిపారు. కాగా, శివసేన ఎమ్మెల్యేలను బాంద్రాలోని రంగ్శర్ధ హౌటల్కు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం ఎటూ తేలకపోవడంతో ఎమ్మెల్యేలు జారిపోకూడదనే శివసేన క్యాంపు రాజకీయాలకు తెరతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజరు రౌత్ ఖండించారు. శివ సైనికులు ఎవరికీ భయపడరనీ, వెన్నుపోటు పొడిచే వారూ కాదని ఆయన తేల్చి చెప్పారు. కూటమిపై తేల్చాల్సింది బీజేపీనేననీ, తాముకాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా వారికి (బీజేపీకి) మెజారిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. లేని పక్షంలో తమ మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన తెలిపారు.
క్యాంపు రాజకీయాలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ఇదేనా కూటమి నీతి అని ప్రశ్నించింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందనే భయంతోనే శివసేన వారిని హౌటల్కు తరలించిందని కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సచిన్ సావంత్ అన్నారు. దీనిని బట్టి చూస్తే బీజేపీ ఎంత అవినీతిలో కూరుకుపోయిందనే విషయం అర్థమవుతుందని ఆయన చురకలంటించారు. ఇక నేటి నుంచి ముంబయికి సమీపాన ఉన్న ఖండాలా, ఇతర ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా మారుతాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సంజరు ఝా ఎద్దేవా చేశారు.