Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7.4శాతం మేర పడిపోయిన వినియోగం
- మందగించిన ఆర్థిక కార్యకలాపాలు
న్యూఢిల్లీ : భారత్లో డీజిల్ ఇంధనం డిమాండ్ గతనెలలో ఆందోళనకరస్థాయికి పడిపోయింది. అక్టోబర్లో డీజిల్ వినియోగం 7.4శాతం మేర క్షీణించి 65.1 లక్షల టన్నులకే పరిమితమైనట్టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వెబ్సైట్లో పేర్కొంది. 2017 జనవరి నుంచి ఈ డిమాండ్ తగ్గుతూ వస్తున్నది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్లో డీజిల్ డిమాండ్ తగ్గుదల ప్రభావం ఊహించినదానికన్నా తీవ్రంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మనదేశంలో ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకు, ఉత్పత్తులు, ముడి సరుకుల రవాణాకు డీజిల్పైనే అధికంగా ఆధారపడతారు. పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపేయడం, అమ్మకాలు పడిపోవడం ఫలితంగా ఆర్థిక వృద్ధి కుంటుపడుతున్న వైనాన్ని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక మందగమనంతోనే డీజిల్ వినియోగం భారీగా తగ్గిందని చర్చిస్తున్నారు. మూడేండ్ల కనిష్టానికి డీజిల్ డిమాండ్ క్షీణించడమే ఆర్థిక వ్యవస్థ అనారోగ్యస్థితిని స్పష్టం చేస్తున్నదని ఇంకొందరు ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏండ్ల చొప్పున(ఇయర్ బేసిస్) పోల్చితే.. మొత్తంగా చమురు వినియోగమూ అక్టోబర్లో1.4శాతం పడిపోయింది. దీంతో చమురు వినియోగం 174.1 లక్షల టన్నులకే పరిమితమైంది. కాగా, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకపాత్ర పోషించే రవాణా రంగం ముఖ్యంగా ట్రక్కులు, లారీలపై ఆధారపడి ఉంటుంది. మందగమనం వల్ల డీజిల్ డిమాండ్ తగ్గడంతో వేల మంది డ్రైవర్లూ ఉపాధి కోల్పోయారు.
అంచనాల్లో కోతపెట్టిన అంతర్జాతీయ సంస్థలు..
పారిశ్రామిక కార్యకలాపాలు, ఆర్థిక వృద్ధి మందగించడంతో ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ సంస్థలు మనదేశంలో చమురు డిమాండ్ అంచనాలను తగ్గించాయి. 2019లో మనదేశంలో ఒక రోజుకు చమురు వినియోగ వృద్ధినిఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీస్.. 1.70లక్షల బ్యారెళ్లకు కుదించింది. 2014 నుంచి ఇదే స్వల్పం కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంలో వృద్ధి ఐదుశాతానికే పరిమితమవడంతో(2013 నుంచి ఇదే అత్యల్ప వృద్ధి) ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ కోతపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా జీడీపీ వృద్ధి ఏమాత్రం ఆశాజనకంగా లేదనీ, ఈ మందగమనే డీజిల్ వినియోగాన్ని తగ్గించిందని ముంబయికి చెందిన కమడిటీస్ అనలిస్ట్ జిగర్ త్రివేది అభిప్రాయపడ్డారు.