Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో అనుమానాలు
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అనంతరం నిర్బంధంలో ఉంటున్న ముగ్గురు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు ఇంకా అదే స్థితి కొనసాగనున్నదా? కేంద్రం వారిని మరికొంత కాలం నిర్బంధానికే పరిమితం చేయనున్నదా? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే దీనికి బలాన్ని చేకూర్చుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ''ఆ ముగ్గురు(ఫరూక్, ఒమర్, ముఫ్తీ) నిర్బంధంలోనే ఉంటే జమ్మూకాశ్మీర్లో అంతా సజావుగా ఉంటుంది. వారిని అలాగే ఉండనిద్దాం'' అని వారి పేర్లు ఎత్తకుండా సూచనప్రాయంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనీ లెఫ్టినెంట్ గవర్నర్ జి.సి ముర్ము వెల్లడించిన తర్వాతి రోజే కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. జమ్మూకాశ్మీర్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న పోటీని నిరోధించేందుకు ఆ ముగ్గురు మాజీ సీఎంలను నిర్బంధంలోనే ఉంచాలని మోడీ సర్కారు భావిస్తున్నదని పలువురు రాజకీయవిశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుపై నిర్ణయం జరిగిన అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్, ఆయన కుమారుడు ఒమర్, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీలను కేంద్రం నిర్బంధంలోనే ఉంచిన విషయం తెలిసిందే.