Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో రైతులకు పరిహారమివ్వాలి
- పంట నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలి
- కాశ్మీర్లో ఏఐకెేఎస్సీసీ ప్రతినిధి బృందం పర్యటన
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
కాశ్మీర్ లోయలో భారీ హిమపాతం, రాజకీయ గందరగోళం వల్ల నెలకొన్న ఆపిల్ సంక్షోభాన్ని 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకెేఎస్సీసీ) బృందం సభ్యులు డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రైతులు ఒకపక్క ఆగస్టు 5 నుంచి ఏర్పడిన రాజకీయ గందరగోళం, మరోపక్క ప్రకృతి వైపరిత్యం వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 250 రైతు సంఘాలకు నేతృత్వం వహిస్తున్న ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకెేఎస్సీసీ)కి చెందిన ఏడుగురు సభ్యుల బృందం కాశ్మీర్ లోయలో నవంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజులు పర్యటించింది. ఈ బృందంలో విఎం సింగ్ (ఏఐకెేఎస్సీసీ కన్వీనర్) కృష్ణ ప్రసాద్ (ఏఐకేఎస్ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే), రాజు శెట్టి (మాజీ ఎంపీ, స్వాభిమాని శెట్కరి సంఘటన), యోగేంద్ర యాదవ్ (జై కిసాన్ ఆందోళన్), ప్రేమ్ సింగ్ గెహ్లాట్ (కిసాన్ మహాసభ), సత్యవన్ (ఏఐకేకేఎంఎస్), స్వాస్తిక్ (ఎస్ఎస్ఎస్)లు ఉన్నారు. ఈ బృందం జమ్మూ కాశ్మీర్లోని రైతులు ఎదుర్కొంటున్న నష్టాల స్వభావం, పరిధిని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్లో మూడు రోజుల పర్యటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న ఏఐకెేఎస్సీసీ బృందం సభ్యులు శనివారం స్థానిక ఉమెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 5 నుంచి జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న రాజకీయ గందరగోళం కారణంగా కోల్డ్ స్టోరేజ్లు అందుబాటులో లేవని, ఫలితంగా రైతులు తమ పంటను నిల్వ చేయలేక తీవ్ర నష్టం చవిచూశారని తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ నుంచి రైతులకు పరిహారం ఇవ్వండి
''లోయలో అకాల భారీ హిమపాతం వల్ల ఏర్పాడిన ఆపిల్ సంక్షోభానికి ప్రకృతి విపత్తుగా ప్రకటించే అర్హత ఉంది. వాస్తవ నష్టాన్ని అంచనా వేయడానికి రెవెన్యూ అధికారులతో తక్షణమే అత్యవసర సమగ్ర క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలి. నష్ట పరిహారంతో పాటు పరిహార ఉపశమనం కోసం ఎన్డీఆర్ఎఫ్ నుంచి రైతులకు పరిహారం ఇవ్వండి. బాధిత రైతుల రుణాలను మాఫీ చేయండి. అదే సమయంలో కేసీసీ రుణాలను రీ షెడ్యూల్ చేయండి. ఆపిల్, కుంకుమ పువ్వు, ద్రాక్ష, చెర్రీ పండ్ల రైతులందరికీ, గొర్రెల పెంపకందారులందరికీ దీర్ఘకాలిక వడ్డీలేని రుణాన్ని ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్ రైతుల పక్షాన ఏఐకెేఎస్సీసీ పోరాడుతుందని తెలిపారు. కనీస మద్దతు ధర, రుణాల నుంచి విముక్తి కోసం దేశవ్యాప్తంగా జరిగే రైతాంగ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని జమ్మూకాశ్మీర్ రైతులకు సూచించారు.
రైతుల ఆశలు అడియాసలు
కాశ్మీర్లోని అన్ని జిల్లాల పండ్ల రైతు సంఘాల ప్రతినిధులతో అధికారం సమావేశాలు నిర్వహించడంతో పాటు, కాశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ప్రతినిధులతో కూడా చర్చించినట్టు తెలిపారు. కుల్గాంలో స్థానిక రైతులు, రైతుల సంఘాల నేతలతో బహిరంగ విచారణ నిర్వహించినట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న హార్టికల్చర్ ఈ సీజన్లో రెట్టింపు నష్టాన్ని చవిచూసిందని బృందం గుర్తించినట్టు తెలిపారు. గత ఏడాది నష్టాల నుంచి కోలుకోవాలని రైతులు ఆశపడ్డారని, కానీ ఆగస్టు 5 నుంచి నెలకొన్న రాజకీయ గందరగోళం రవాణా పరిశ్రమ, పంట సేకరణ మార్కెట్ను తీవ్రంగా ప్రభావం చేసిందన్నారు. అందువల్ల పండ్ల రైతులు సకాలంలో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయలేకపోయారని, ఈ గందరగోళం రైతులను అనేక విధాలుగా బాధించిందన్నారు. ఆగస్టులో పండించిన పియర్, చెర్రీ, ద్రాక్ష వంటి పంటలను నిల్వ చేయలేకపోయారని, మార్కెట్ కూడా చేయలేకపోయారని తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవడానికి దారితీసిందని అన్నారు.
ప్రజల జీవనోపాధి ధ్వంసం
ఆపిల్ పంట కోత సెప్టెంబర్లో ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పంట కోత ప్రారంభమైన మొదటి 60 రోజులు టెలిఫోన్లు పని చేయకపోవడం, ఇప్పటికీ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ఆపిల్ రైతులకు, రవాణాదారులకు, వ్యాపారులకు మధ్య కమ్యూనికేషన్ విచ్ఛిన్నమైందని, దీనివల్ల డిమాండ్-సప్లై మధ్య అంతరాయం ఏర్పాడిందని వివరించారు. గ్రామాలకు వెళ్లడానికి ట్రక్కులను అనుమతించకపోవడం, రైతులు తమ ఉత్పత్తులను జాతీయ రహదారులకు తీసుకురావాలని బలవంతం చేయడంతో రైతులు ఆపిల్స్ను మార్కెట్లకు తీసుకురాలేకపోయారని, ఇది ఆలస్యం, అసౌకర్యం, అదనపు ఖర్చులకు కారణమైందని తెలిపారు. భద్రతా ముప్పు, ట్రక్కులు అందుబాటులో లేకపోవడంతో రవాణా ఖర్చు దాదాపుగా రెట్టింపు అయిందని, తరుచూ రవాణా రహదారులను మూసివేయడం వల్ల రవాణా సమయంలో మరింత ఆలస్యం వల్ల ఆపిల్ పరిమాణం, నాణ్యత కోల్పోయాయని అన్నారు. సేకరణను నిర్వహించడానికి ప్రభుత్వం నాఫెడ్కు అధికారం ఇచ్చిందని, కానీ ఈ చర్యలు ఘోరంగా విఫలమైందని, నాఫెడ్ కేవలం 0.01శాతం మాత్రమే సేకరించిందని తెలిపారు. దేశం మొత్తంలో ఆపిల్ ఉత్పత్తిలో కాశ్మీర్ 75 శాతం ఉత్పత్తి చేస్తుందని, కాశ్మీర్ హార్టికల్చర్ రంగంలో ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉందని తెలిపారు. నవంబర్ 7న లోయ అంతటా అకాల భారీ హిమపాతం కారణంగా రాష్ట్రంలోని ఉద్యానవనం తీవ్రంగా దెబ్బతిన్నదని, దీంతో ఆపిల్ చెట్లు విస్తృతంగా నష్టపోయాయని, ఇది రాబోయే 3-4 ఏండ్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం
కాశ్మీర్ పరిపాలన విభాగం ప్రకృతి విపత్తుగా గుర్తించకపోవటం, నష్టాల పరిధిని అంచనా వేయడానికి ఇప్పటి వరకు ఏ క్షేత్రస్థాయి సర్వేను ప్రారంభించ కపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇంత వరకు రైతులు, వ్యాపారులు, రవాణా చేసేవారితో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదని పేర్కొన్నారు. అందువల్ల కాశ్మీర్ రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని, ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఏఐకేఎస్సీసీ ప్రతినిధి బృందం సభ్యులు కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులందరూ కాశ్మీర్ లోయ రైతులకు సంఘీభావం తెలపాలని సూచించారు.