Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగురాష్ట్రాల్లో నీరు సురక్షితం కాదు...
- 20 రాష్ట్రాల రాజధానుల్లో అధ్యయనం
- ముంబయి పానీ ఒక్కటే బెటర్
న్యూఢిల్లీ : నీరు ప్రాణాధారం. మనిషే కాదు.. మొక్కలు, జంతువులు ఇలా సమస్త జీవకోటి నీరు లేనిదే మనుగడ సాగించలేదు. మరి మనం రోజూ తాగే నీరు సురక్షితమైనదా? గాలి, వాతావరణంతో పాటు తాగే నీరు కూడా కలుషితమైనవేనా? ప్రభుత్వాలు సరఫరా చేసే ట్యాప్ వాటర్లో నాణ్యత ఎంత? ఆ నీరు తాగి రోగాల పాలవుతున్నామా? అవును.. మనం తాగే నీరు సురక్షితమైనదికాదనీ, రోగాలపాలవు తున్నా మని చెబుతున్నాయి అధ్యయనాలు... ఇది ఏ ప్రయివేటు సంస్థ నిర్వహించిన అధ్యయంకాదు.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనం. తాగేందుకు ముంబయి ట్యాప్ వాటర్ ఒక్కటి మాత్రమే సురక్షితమైనదనీ, ఇతర 20 రాష్ట్ర రాజధానుల్లో నీరు అసురక్షితమైనదనీ తేలింది. వీటిలో తెలుగురాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్ (తెలంగాణ), అమరావతి (ఏపీ) నగరాల్లోనూ ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) స్పెసిఫికేషన్ ప్రకారం నీరు లేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధ్యయనంలో తేల్చింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షించిన 11 నాణ్యత ప్రమాణాల్లో విఫలమయ్యాయి ఇందులో ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్కతా, చెన్నై కూడా ఉండటం గమనార్హం. కాగా, ముంబయి వాసులు మాత్రం రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) వాటర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేయనవసరం లేదని అధ్యయనంలో తేలింది.
అధ్యయన నివేదికను వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శనివారం విడుదల చేశారు. 'ముంబయిలో నల్లా నుంచి తీసిన నీళ్ల 10 నమూనాల్లో మొత్తం 11 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించాం. ఇతర నగరాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాల్లో విఫలమయ్యాయి' అని పాశ్వాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా పైపు నీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలను పాటించడమే ఈ సమస్యకు పరిష్కారం. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు చెప్పారు. 'పైపుల నీటి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి కాకపోవటంతో కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఆ పని పూర్తయ్యాక... మేం చర్యలు తీసుకోవచ్చు' అని పాశ్వాన్ అన్నారు.
- మొదటి దశలో పరీక్షలు నిర్వహించిన దేశరాజధాని ఢిల్లీలో తీసిన 11 నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవనీ, పైపుల నీరు సురక్షితం కాదని తేలిందని చెప్పారు. ఆర్గానోలెప్టిక్, భౌతిక ప్రమాణాలు, వైరోలాజికల్, బయోలాజికల్ ప్రమాణాలతో పాటు రసాయన, విష పదార్థాలు, బ్యాక్టీరియా నాణ్యతను తెలుసుకోవడానికి దాదాపు 11 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు.
- రెండోదశలో హైదరాబాద్, భువనేశ్వర్, రాంచీ, రారుపూర్, అమరావతి, సిమ్లా వంటి మొత్తం 20 నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో ఎక్కడా ఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. అంటే.. హైదరాబాద్లోని నీటి నమూనా ఒక విభాగం 'ఫినోలిక్ కాంపౌండ్స్'లో, భువనేశ్వర్ 'క్లోరమైన్స్'లో విఫలమయ్యాయి. అయితే చండీగఢ్ రెండు విభాగాల్లో 'అల్యూమినియం, కోలిఫాం'లో విఫలమైంది. చెన్నైలో, మొత్తం పది నమూనాలు తొమ్మిదింటిలో విఫలమయ్యాయి. టర్బిడిటీ, క్లోరైడ్, ఫ్లోరైడ్, అమోనియా, బోరాన్, కోలిఫాం, హార్డ్నెస్ వంటి తొమ్మిది ప్రమాణాల్లోనూ విఫలమయ్యాయి, కోల్కతాలోని మొత్తం తొమ్మిది నమూనాలు పది నాణ్యతా ప్రమాణాల్లో విఫలమయ్యాయని అధ్యయనం తెలిపింది.
- మూడవ దశలో, ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలు, 100 స్మార్ట్ సిటీల నుంచి నమూనాలను పరీక్షించనున్నట్టు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 2020 జనవరి 15 నాటికి ఆ నివేదిక రూపొందించనున్నట్టు చెప్పారు. నాల్గవ దశలో, దేశంలోని అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి నమూనాలను పరీక్షించాలన్నది ప్రతిపాదన. 2020 ఆగస్టు 15 నాటికి ఆ ఫలితాలు వెలువడతాయని అన్నారు..