Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం
- సీపీఐ(ఎం) నుంచి నటరాజన్... టీఆర్ఎస్ నుంచి నామా హాజరు
నవ తెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లోని కమిటీ రూమ్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని ఆయన ప్రత్యేకంగా కోరారు. సమావేశానంతరం స్పీకర్ ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. సభలో చర్చించాల్సిన అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపినట్టు తెలిపారు. ఈ అంశాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) ఖరారు చేసిన తరువాత సభలో చర్చిస్తామని చెప్పారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చలు, వాదనలు చేయాలనీ, విభేదాలు ఉన్నప్పటికీ సభ కార్యకలాపాలు అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని కోరారు. గత సమావేశాల మాదిరిగానే, ఈ సమావేశాల్లో కూడా సభను కొనసాగడానికి, క్రమబద్ధంగా నిర్వహించడానికి అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్ (బీజేపీ), పీఆర్ నటరాజన్ (సీపీఐ(ఎం), అధీర్ అంజన్ చౌదరి, కె సురేష్ (కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యయ (టీఎంసీ), పీవీ మిథున్ రెడ్డి (వైసీపీ), పినాకి మిశ్రా (బీజేడీ), దానిష్ అలీ (బిఎస్పీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), వినాయక్ రౌత్ (శివసేన), హసనైన్ మసూది (నేషనల్ కాన్ఫెరెన్స్), అసదుద్దీన్ ఒవైసి (ఎంఐఎం), అనుప్రియా పటేల్ (అప్నాదల్) తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం తన ఎజెండాపై చర్చించేందుకు సిద్ధపడింది. బిల్లులను ఆమోదించేందుకు యోచిస్తుంది. దేశంలో నెలకొన్న ఆర్థిక తిరోగమనం, నిరుద్యోగిత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సమాయత్తం అవుతుంది.
రాజ్యసభలో శివసేన స్థానాలు మార్పు
మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన తరపున కేంద్ర మంత్రి పదవికి అరవింద్ గణపత్ సావంత్ రాజీనామా చేశారు. దాన్ని కేంద్ర కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆయన శాఖలన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలోని శివసేన ఎంపీ స్థానాలు మార్పు చేశారు. శివసేన ఎంపీ సంజరు రౌత్, అనిల్ దేశారుల స్థానాలు మార్పు చేస్తూ రాజ్యసభ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ ఇద్దరు ఎంపీలు ప్రతిపక్షం వైపు కూర్చొంటారు. దీనిపై సంజరు రౌత్ స్పందిస్తూ తమ పార్టీ ఎంపీల సిటింగ్ ఏర్పాటు మార్చినట్టు తమకు తెలిసిందని అన్నారు. గతంలో ఉండే ఎన్డీఏకి, ప్రస్తుతం ఉండే ఎన్డీఏకి చాలా తేడా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ కన్వీనర్ ఎవరు? దాని వ్యవస్థాపకులలో ఒకరైన అద్వానీ విడిచిపెట్టారని తెలిపారు.