Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి హర్యానా డిప్యూటీ సీఎం లేఖ
చండీగఢ్ : వాతావరణ మార్పులను పాఠ్యాంశంగా బోధించాలని కోరుతూ హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు రాసిన లేఖలో .. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో వాతావరణ మార్పు ఒకటనీ, ఈ సమస్య మన దేశంలో మరింత తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఈ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలనీ లేకపోతే.. ప్రతి పౌరుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో.. వాతావరణ మార్పు, సుస్థిరత అభివృద్ధిని తప్పని సరిగా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కోరారు. ప్రాథమిక విద్యలోనే వాతావరణం, స్థిరమైన అభివృద్ధిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే.. భావి తరాలకు దాని ప్రాముఖ్యత తెలిసే వీలుంటుందని లేఖలో ప్రస్తావించారు. ఇటీవలే మొదటిసారిగా ఇటలీలో.. ప్రతి పాఠశాలలో వాతావరణంపై అవగాహన తరగతులను నిర్వహించాలని నియమం తెచ్చారని పేర్కొన్నారు. అలాగే దేశంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలనీ, అడవుల నరికివేత అరికట్టాలనీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులని అన్వేషించాలనీ చౌతాలా సూచించారు.