Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కారం కానంత వరకు ఆత్మహత్యలు ఆగవు
- ఇప్పుడున్నదానికంటే మెరుగైన 'పంట బీమా' రావాలి : ఎన్ఐఏఎస్ నివేదిక
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, వ్యవసాయరంగాన్ని వీడటం...అనేక సమస్యల్ని సృష్టిస్తుందనీ, ముందు ముందు ప్రపంచ జనాభాకు ఆహార సంక్షోభం రావొచ్చుననీ వారు హెచ్చరిస్తున్నారు. పంటల సాగులో సృజనాత్మక, నీటి వనరుల్ని పెంపొందించుకోవటం చేయకపోతే 2050నాటికి ప్రపంచ మానవాళి సంక్షోభంలో కూరుకుపోతుందనీ 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్' తాజా అధ్యయనంలో నిపుణులు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు పోవాలంటే...రైతాంగ సమస్యలు పరిష్కరించటమొక్కటే మార్గమని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్'(ఎన్ఐఏఎస్) తాజా నివేదిక స్పష్టంచేసింది. సంక్షోభం కారణంగా రైతులు పెద్ద ఎత్తున ఉపాధిని కోల్పోతున్నారనీ, వ్యవసాయేతర రంగంవైపు వెళ్తున్నారనీ నివేదిక తెలిపింది. వ్యవసాయాన్ని వీడుతున్న రైతులకు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే సంక్షోభం మరింత ముదురుతుందనీ నివేదిక రూపొందించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన 'పంటల బీమా' తీసుకురావాల్సిన అవసరముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మూడేండ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి...
ప్రతిఏటా వేలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ ఇటీవల విడుదలైన 'జాతీయ నేర పరిశోధన బ్యూరో' గణాంకాలే చెబుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుగాక పోవటం, మరోవైపు అప్పుల భారం పెరగటం రైతుల్ని ఆవేదనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోవటం వారిని దారుణంగా కుంగదీస్తోంది. ప్రధాన సమస్యలకు పరిష్కారం లభించనంత వరకు ఆత్మహత్యలు ఆగవు. సాగునీరు, రేషన్ సరుకులు, వైద్య వసతులు...వంటి ప్రాథమిక అవసరాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీరిస్తే కొంతలో కొంత మార్పు రావొచ్చు.
పట్నం వెళ్లి ఏదైనా పనిచేసుకుంటా...
దేశ జీడీపీలో వ్యవసాయరంగం వాటా 19 నుంచి 15శాతానికి పడిపోయింది. అయినా దేశంలోని అత్యధిక శాతం ప్రజలకు వ్యవసాయమే ఆధారమైంది. అయితే ఈమధ్య సంక్షోభం ముదిరి అనేకమంది ఈరంగాన్ని వదిలేస్తున్నారు. పట్టణానికి వెళ్లి ఏదైనా పనిచేసుకుందామని భావిస్తున్నారు. దీంతో వ్యవసాయేతర రంగంలో ఉపాధికి పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది. దీనిని ఎదుర్కోవాలంటే, వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వాలు 'స్కిల్ డెవలప్మెంట్' కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. గ్రామీణ యువత పట్టణాలకు వలస పోవటం ఆపాలంటే వారికి స్కాలర్షిప్ సౌకర్యం కల్పించి నైపుణ్య శిక్షణ అందించాలి.
వ్యవసాయ కూలీలకు వృత్తి నైపుణ్యం
- పంటల సాగులో రైతులకు వివిధ అంశాలపై సాయం చేయడానికి ప్రత్యేక సంస్థలు ఏర్పాటుచేయాలని 'ఎన్ఐఏఎస్' అధ్యయనంలో పరిశోధకులు సూచించారు.
- మద్దతు ధర, మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించాలి. ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా చూడాలి. ఇప్పుడున్నదానికంటే మెరుగైన పంట బీమా రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
- ఉపాధి కోల్పోయిన వ్యవసాయ రైతు కూలీలకు వృత్తి శిక్షణ నైపుణ్య కార్యక్రమాల్ని చేపట్టాలి. ఉపాధి కోసం పట్టణాలకు వలస పోతే అక్కడ వారికి ప్రత్యేక వసతి భవనాలు ఏర్పాటుచేయాలి.