Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లిం లా బోర్డు కీలక నిర్ణయం
లక్నో : దశాబ్దాల అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఈ మధ్యే వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపీఎల్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ కళాశాలలో బోర్డు సభ్యులతో పాటు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, ముస్లిం మత పెద్దలు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. సమావేశానంతరం బోర్డు సెక్రెటరీ, న్యాయవాది జఫర్యాబ్ జిలాని స్పందిస్తూ.. అయోధ్య తీర్పును సవాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే బాబ్రీ మసీదుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే ఐదెకరాల స్థలాన్ని సైతం నిరాకరిస్తున్నామని చెప్పారు. 'షరియా లా ప్రకారం మసీదు భూమి అల్లాకు చెందినది. దానిని ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదు' అని జిలాని వివరించారు. సమావేశంలో పాల్గొన్న మరో ముస్లిం సంస్థ జమాయిత్-ఉలమ-ఐ-హింద్ సైతం తీర్పును సవాల్ చేయాలని నిర్ణయించింది. కోర్టు ఇచ్చిన తీర్పు 'తర్కానికి విరుద్దంగా ఉన్నద'ని ఆ సంస్థ అధ్యక్షుడు అర్షద్ మదాని తెలిపారు. కాగా పిటిషన్ ఎప్పుడు వేస్తారనే విషయాన్ని మాత్రం ఎఐఎంపీఎల్బీ ప్రకటించలేదు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత దీనిపై తదుపరి ప్రకటన చేస్తామని బోర్డు తెలిపింది. అయోధ్య భూ వివాదం కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎఐఎంపీఎల్బీ దాఖలు చేయబోయే పిటిషన్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.