Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(భారత) ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టుకు 46వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 13 నెలలపాటు ఆ పదవిలో ఉన్నారు. సీజేఐగా శుక్రవారం ఆయన తన చివరి పనిదినం ముగించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలి సీజేఐగా అసోంకు చెందిన జస్టిస్ గొగోయ్ రికార్డు నెలకొలిపారు.
ఈ నెలలోనే ఆయన పలు కీలక తీర్పులను వెల్లడించారు. సుదీర్ఘకాలంపాటు కొనసాగిన అయోధ్య భూవివాదంపై తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లపై విచారణను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసిన ముగ్గురు న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరు. కాగా, ఈ కేసులో జస్టిస్ గొగోయ్తో విభేదించిన మరో ఇద్దరు న్యాయమూర్తులు మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పును సమర్థించడం గమనార్హం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్పై కేంద్ర మాజీమంత్రులు యశ్వంత్సిన్హా, అరుణ్శౌరీ వేసిన సమీక్ష పిటిషన్లను కొట్టి వేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి కూడా జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. కాగా, ఈ కేసులోనూ జస్టిస్ కెఎమ్ జోసెఫ్ మిగతా ఇద్దరు సభ్యులతో విభేదించి వేరుగా తీర్పు ఇచ్చారు. రాఫెల్ డీల్పై సీబీఐ దర్యాప్తునకు తమ తీర్పు అడ్డంకి కాబోదని జస్టిస్ జోసెఫ్ స్పష్టం చేశారు.
నేడు నూతన సీజేఐగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే బాధ్యతలు
సోమవారం 47వ సీజేఐగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే(63) బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డేను సీజేఐగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పటికే వెలువడ్డాయి. 2021, ఏప్రిల్ 23 వరకు అంటే 17 నెలలపాటు జస్టిస్ బోబ్డే ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ బోబ్డే మహారాష్ట్ర నాగపూర్లోని న్యాయవాదుల కుటుంబానికి చెందినవారు. అయోధ్యపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఈయన కూడా ఉన్నారు. జస్టిస్ గొగోయ్ పై ఓ మహిళా ఉద్యోగి నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చినపుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీలో జస్టిస్ బోబ్డే కూడా ఉన్నారు. జస్టిస్ గొగోయ్ కి ఈ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది.