Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా పరిహారం చెల్లించలేదని నిరసలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గంగా సిటీ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా.. సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను ఆదివారం ముట్టడించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘర్షణలో పలువురు రైతులు గాయపడ్డారు. పలువురు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ.. ఏడేండ్ల క్రితం గంగా సిటీ ప్రాజెక్ట్ కోసం యోగి ప్రభుత్వం తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నదనీ, తమకు అందాల్సిన నష్ట పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం ఇవ్వాలని నిలదీసినందుకు తమపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు. తాము గ్రామాలకు వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కల్గించకుండా ప్రజలకు విజ్ఞప్తి చేస్తామనీ, ఇలాంటి దుశ్చర్యలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గంగా సిటీ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.