Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలి
- స్ఫూర్తినిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పోరాటాలు
- సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్
- సమరోత్సాహంతో రాజమండ్రిలో ఏఐఎడబ్ల్యుహెచ్ఎఫ్
- అఖిల భారత మహాసభలు ప్రారంభం
రాజమహేంద్రవరం : పాలకులు అనుసరిస్తోన్న సరళీ కరణ విధానాలే కార్మిక వర్గానికి, ప్రజలకు ఉమ్మడి శత్రువు లని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్ అన్నారు. వినాశకర విధానాల నుంచి ప్రభుత్వాలను వెనక్కి కొట్టేందుకు ఐక్యపోరాటాలు నిర్వహించాలని పిలుపుని చ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక హక్కులపై దాడి చేస్తూ ప్రయివేటీకరణ ద్వారా కార్పొరేట్లకు దోచి పెడుతున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పలు వీరోచిత పోరాటాలు నిర్వహించి తమ హక్కులు సాధించుకోవడమే కాకుండా మధ్యాహ్న భోజన, ఉపాధి హామీ, ఆశా తదితర స్కీం వర్కర్లకు స్ఫూర్తినిస్తు న్నారని తెలిపారు. సంఘ విస్తరణకు, సంఘటితానికి మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అఖిల భారత అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమాఖ్య (ఏఐఎడబ్ల్యుహెచ్ఎఫ్) తొమ్మిదవ మహాసభ ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది. సంఘం అఖిల భారత అధ్యక్షురాలు కె.ఉషారాణి జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ప్రారంభ సభకు ఆమె అధ్యక్షత వహించారు. తపన్సేన్ ప్రారంభోపన్యాసం చేస్తూ ముందుగా కార్మికులు తమకు శత్రువులెవరో గుర్తించాలని సూచించారు. ఆర్థిక మాంద్యం మొదలుకొని కార్మిక హక్కులపై దాడులు, వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభాలు, నిరుద్యోగం, అన్ని సమస్యలకూ ప్రభుత్వాల విధానాలే కారణమని, వాటిని విశాల ఐక్య ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాల్లోకి రైతులను, కార్మికులను, వ్యవసాయ కార్మికులను, ఇతర స్కీం వర్కర్లను, సామాజికంగా అణచివేయబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, పేదలను, మహిళలను కలుపుకొనిపోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు, బాలింతలకు పోషకాహారం అందించే ఐసీడీఎస్ను ప్రయివేటీకరించి వేదాంత, పెప్సీ, పతంజలి వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోడీ సర్కారు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. 'కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టవు. ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తారు.' అని తెలిపారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనడానికి ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే కారణమన్నారు.
పెను ప్రమాదాలు
ప్రభుత్వ అండతో కార్పొరేట్ల దోపిడీ కొనసాగుతుండగా, దీనినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోడీ ప్రభుత్వం... మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని తపన్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఏలుబడిలో దేశం అత్యంత ప్రమాదంలో పడిందని తెలిపారు. ఈ సవాళ్లను సమైక్యంగా ఎదుర్కోవాలన్నారు. లోపాలను, అడ్డంకులను అధిగమించి సంఘాన్ని విస్తరించడంతోపాటు రాజకీయంగా సంఘటిత పర్చాలని అన్నారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేయగా, అంగన్వాడీ సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎ.ఆర్.సింధు తొలుత అతిథులను వేదికమీదికి ఆహ్వానించారు. ప్రారంభ సభలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్, అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, తదితరులు పాల్గొన్నారు.