Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాడేపల్లి : అమరావతి కరకట్టపై గల నివాస గృహానికి (లింగమనేని ఎస్టేట్స్) శనివారం సాయంత్రం ఏపి ముఖ్యమంత్రి సతీ సమేతంగా వచ్చారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా లోటస్ఫుడ్ సిటీ పక్కనుండి ముఖ్యమంత్రి కాన్వారు గృహానికి వెళ్ళింది. ఉదయం నుండి ఈ మార్గంలో రోడ్డు పనులు చేస్తూనే ఉన్నారు. గుంతలు పూడ్చి బూడిద చల్లారు. ఉదయం నుండి కట్టమీద వాహనాల రాకపోకలతో లేచిన బూడిదతో ఆ ప్రాంతమంతా చిందరవందరగా తయారైంది. దీంతో నీటి ట్యాంకర్లు తెప్పించి రోడ్డును తడిపి ముఖ్యమంత్రి కాన్వారువచ్చే సమయానికి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నివాస గృహంలో మూడు గంటలపాటు గడిపారు. మీడియాతో సహా ఎవరినీ గృహంలోకి రానీయకుండా పోలీసులు కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నివాస గృహంలో ముఖ్యమంత్రి తన సతీమణితో సహా ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున మీడియా అక్కడికి చేరుకుంది. గృహానికి సుమారు 200 గజాల దూరంలోనే మీడియా ప్రతినిధులను నిలిపివేశారు. మధ్యలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వచ్చి మాట్లాడి వెళ్ళారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో కరకట్టపై వచ్చిపోయేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం రైతులను కూడా అటువైపు వెళ్ళనీయలేదు.