Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు వర్శిటీ బిల్లుపై నిరసనగా విజయవాడలో ర్యాలీ
- సిపిఎం ఏపి కార్యాలయంలోకి చొరబడ్డ పోలీసులు
- ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు నాయకుల అరెస్ట్
-విద్యార్థులపై పోలీసు లాఠీ
విజయవాడ:ప్రయివేటు యూనివర్శిటీ బిల్లును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై ఖాకీలు లాఠీఛార్జీ చేశారు. విద్యార్థులను రోడ్డుపై ఈడ్చివేసి విచక్షణా రహితంగా ప్రవర్తించారు. జుట్టుపట్టుకునికొట్టారు. మరోవైపు గవర్నర్పేట వైపు నుండి బందరు రోడ్డులోకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో విచక్షనా రహితంగా వ్యవహరిస్తుండటంతో భయపడిన విద్యార్థులు వారి నుండి తప్పించుకునేందుకు సమీపంలో సిపిఎం రాష్ట్ర కార్యాలయం పక్కనే ఉన్న ఎంబి అధ్యయన కేంద్రంలోకి పరిగెత్తారు. అక్కడ నుండి సిపిఎం కార్యాలయంలోకి చేరుకున్నారు. వారిని వెంటాడిన గవర్నర్ పేట సిఐ శ్రీనివాసరావు సిబ్బంది నేరుగా కార్యాలయంలో కెళ్లిపోయారు. విద్యార్థులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కార్యాల యంలో ఉన్న సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ పోలీసులను అడ్డుకున్నారు. కార్యాలయంలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతికాదన్నారు. దీంతో సహనం కోల్పోయిన సిఐ శ్రీనివాసరావు తాము ఎక్కడకొచ్చైనా అరెస్టులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అలాంటి వాటికి లొంగేది లేదని, కార్యాలయంలోకొస్తే సహించేది లేదని మధు హెచ్చరించారు. వాగ్వివాదం జరుగుతున్న సమయంలోనే పోలీ సులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి తప్పించుకున్న కొద్దిమంది విద్యార్థులు వేగంగా సిఎం క్యాంపు కార్యాలయంవైపు బయలు దేరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో వారిపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పరిగెత్తుకుంటూ రైతుబజారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని రోడ్డుపై ఈడ్చి పారేశారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడి విద్యార్థులను ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో ఎత్తి పడేశారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి గవర్నర్పేట, ఇబ్రహీంపట్నం, తోట్లవల్లూరు పోలీసుస్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎస్ఎఫ్ఐ ఏపి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, నూర్మహ్మద్, ఉపాధ్యక్షులు బి.లక్ష్మణరావు, సంఘ గర్ల్స్ రాష్ట్ర కన్వీనర్ టి.రాణి, జిల్లా అధ్యక్షులు టి.ప్రవీణ్, నగరఅధ్యక్ష, కార్యదర్శులు ఎన్.కోటిబాబు, పిడిఎస్యు రాష్ట్ర నాయకులు రవిచంద్ర, రామమోహన్, రామకృష్ణ, మల్లిఖార్జును ఉన్నారు.