Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంచు కూడా వెనక్కి తగ్గబోం : బీజేపీకి వామపక్ష విద్యార్థుల హెచ్చరిక
తలకు బ్యాండేజీ కట్టు తొలగించలేదు, చేతికి చుట్టిన పట్టీ అలాగే ఉంది. గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి వారం కూడా గడవకముందే మీడియా ముందు నిల్చొని తామెందుకు పోరాడుతున్నదీ ప్రపంచానికి చాటారు. తమపై హింసను ప్రయోగిస్తే మౌనం వహించబోమని తెగేసి చెప్పారు. జేఎన్యూను కాపాడుకునేందుకు తాము సాగిస్తున్న ఉద్యమం నుంచి ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గేది లేదంటూ ధిక్కార స్వరాన్ని వినిపించారు. గాయాల బాధల్ని లెక్క చేయకుండా చెదరని చిరునవ్వుతో కేంద్రంలోని మోడీ సర్కార్కు సవాల్ విసురుతున్న ఆమె ఎవరోకాదు.. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకురాలు, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్..
న్యూఢిల్లీ: ఆ గొంతు నుంచి వినిపిస్తున్న ధిక్కార స్వరంతో జేఎన్యూ విద్యార్థులేకాదు, దేశంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు గొంతు కలిపారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న విద్యార్థి, ప్రజా వ్యతిరేక, విద్వేషపూరిత బెదిరింపు రాజకీయాలిక చెల్లవుగాక చెల్లవంటూ విద్యార్థి లోకం సవాల్ విసురుతోంది. విద్యార్థులకు రాజకీయా లెందుకంటూనే తమ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ సాగిస్తున్న హింసాత్మక దాడుల్ని పాలక బీజేపీ నేతలు సమర్థిస్తున్నతీరును వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ముసుగులు ధరించి జనవరి 5న జేఎన్యూలోకి మారణా యుధాలతో ప్రవేశించి వామపక్ష విద్యార్థులపై దాడికి పాల్పడింది ఏబీవీపీకి చెందినవారేనని, అందులో ఆ సంస్థకు చెందిన ఓ మహిళా విద్యార్థి కూడా ఉన్నట్టు మీడియా పరిశోధనలో స్పష్టమైంది. దుండగుల దాడిలో 29మంది విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దాడిలో అయిషీఘోష్ తల పగిలి రక్తం ధారలుగా కారినతీరు దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది. స్వతంత్ర భారతావనిలో యూనివర్సిటీ విద్యార్థులపై ఇంతటి క్రూరమైన దాడిని గతంలో తామెప్పుడూ చూడలేదని పలువురు మేధావులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయంగానూ పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి జేఎన్యూ విద్యార్థుల పట్ల సంఘీభావం వ్యక్తమైంది. ఆ రోజు జరిగిన దాడి గురించి చెబుతూ తన తలపై ఇనుప రాడ్లతో పదేపదే మోదారని, తనను చంపాలన్న లక్ష్యం వారిలో కనిపించిందని అయిషీఘోష్ అన్నారు. గతేడాది సెప్టెంబర్లో జేఎన్యూలో జరిగిన ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల కూటమి తరఫున అయిషీఘోష్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో పీహెచ్డీ చేస్తున్నారు. వామపక్ష విద్యార్థుల్ని భయకంపితుల్ని చేయాలన్న లక్ష్యంతోనే ముందస్తు ప్రణాళికతోనే ఏబీవీపీ ఈ దాడికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు. ఓవైపు దాడి జరిగింది వామపక్ష విద్యార్థులపై కాగా, మరోవైపున బీజేపీ నేతలు మాత్రం హింసకు కారణం వామపక్ష విద్యార్థులే అంటూ ఉల్టాచోర్ ప్రచారం ప్రారంభించారు.
ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో దాడికి పాల్పడింది తామేనని ఏబీవీపీ విద్యార్థులు అంగీకరించారు. వామపక్ష విద్యార్థుల్ని అణచివేసే లక్ష్యంతోనే దాడి జరిపామని కూడా గొప్పగా చెప్పుకున్నారు. అయితే, ఏబీవీపీ విద్యార్థులకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు..? దాడికి పది రోజుల ముందు హౌంమంత్రి అమిత్షా వ్యాఖ్యల్లోని హెచ్చరికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది.