Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక నుంచి కలిసి నడుస్తాం : పవన్ కల్యాణ్
- సీఏఏకు సంపూర్ణ మద్దతు
అమరావతి : 'ఇకనుండి కలిసి నడుస్తాం. రెండు పార్టీల మధ్య చిన్న.చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం.' అని బీజేపీ, జనసేనలు ప్రకటించాయి. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఇరు పార్టీ నేతలు గురువారం సమావేశమయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసే అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ. రాష్ట్రంలోనే కాకుండా అవసరమున్న ఏ ప్రాంతంలోనైనా బీజేపీకి సహకారం అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూపొందించిన
సీఏఏకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కలిని వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలెగాళ్ల పాలన సాగుతున్నదని, గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. రెండు పార్టీల మధ్య ఉన్న సమస్యల విషయమై అధ్యయనం కోసం కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు పార్టీలు కలసి, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ధీమాను వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో అత్యధిక ఎంపీలు ఉన్న వైసీపీని నిలదీయాలని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఎన్నార్సీ, సీఏఏలపై అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. దాని వల్ల దేశంలోని ముస్లింల పౌరసత్వం పోతుందన్నట్టుగా కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, అది వాస్తవం కాదని చెప్పారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెడితే రోడెక్కి పోరాడుతామని చెప్పారు. . తాను గతంలో కూడా బీజేపీ కోసం పనిచేశానని అన్నారు. బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జనసేనతో తప్ప మరే ఇతర పార్టీలతోనూ తమపార్టీకి రాజకీయ సంబంధాలు లేవన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి షరుతులూ లేకుండా తమతో కలిసి నడిచేందుకు వచ్చిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు చెప్పారు.
మోసం చేయడమే ... : సీపీఐ(ఎం), సీపీఐ
రాష్ట్ర విభజనకు కారణమై, ప్రత్యేకహోదాను నిరాకరించి అన్ని విధాల ద్రోహం చేస్తున్న బీజేపీతో జనసేన చేతులు కలపడాన్ని ప్రజలను మోసం చేసే చర్యగా సీపీఐ(ఎం), సీపీఐలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు గురువారం సాయంత్రం వేర్వేరు ప్రకటనలను విడుదల చేశాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. మధు విడుదల చేసిన ప్రకటనలో బీజేపీతో జనసేన చేతులు కలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు . 'ఈ చర్య రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగి స్తుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటికీ నీళ్లొదిలి, వెనకబడిన ప్రాంతాల అభివ ద్ధికి నిధులు నిరాకరించి, ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లకు కట్టబెడు తున్న బీజేపీని ''పాచిపోయిన లడ్డు'' ఇచ్చారంటూ విమర్శించిన పవన్కల్యాణ్కు, ఇప్పుడు అవే తాజా లడ్డూలుగా గోచరించడం విడ్డూరం. రాష్ట్రాభివద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే కాదు, ఆత్మవంచన కూడా! ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏను రద్దు చేయాలన్న డిమాండ్పై ఉద్యమాలు జరుగుతుంటే, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్న బీజేపీతో చేతులు కలపడం పవన్ కల్యాణ్ అవకాశవాదాన్ని తెలియజేస్తోంది.' అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి, దేశానికి బీజేపీ చేసిన ద్రోహానికి రాష్ట్రప్రజలు 2019 ఎన్నికల్లోనే ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని, రాబోయే రోజుల్లో కూడా అదే విధమైన చైతన్యంతో మతోన్మాద కూటమిని తిరస్కరించాలని మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నీతిమాలిన చర్య : రామకృష్ణ
బీజేపీతో జనసేన చేతులు కలపడం నీతిమాలిన చర్య అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన చట్టాలు, ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందని, దేశంలో మతతత్వ వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న బీజేపీతో జనసేన కలవడాన్ని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. మిత్రపక్షాలు సైతం బీజేపీపీ వీడుతున్న నేపథ్యంలో పవన్ మాత్రం బీజేపీ పంచన చేరడం ఆశ్చర్యకరమని తెలిపారు. సినీ తార దీపికా పదుకొనే వంటి వారు ధైర్యంగా జెఎన్యు విద్యార్థులకు సంఘీభావం తెలియజేస్తే..,. ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ జెఎన్యును సందర్శించకుండా బీజేపీ కార్యాలయం తలుపు తట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు.