Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగ నోట్ల వాటా 26.28 శాతం
గాంధీనగర్: దేశప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ నకిలీ నోట్లకు హబ్గా మారిందంటే నమ్ముతారా.. ఇది ఏ ప్రయివేటు సంస్థ చేసిన అధ్యయనమో కాదు. స్వయానా జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పష్టం చేసింది. గణాంకాల ప్రకారం.. ఈ నకిలీ నోట్ల స్వాధీనం కొన్ని రాష్ట్రాల్లో కేంద్రీకృతమైంది. రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టిన నవంబర్ 2016 నుంచి నకిలీ నోట్లకు కేంద్రంగా బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ తొలి స్థానంలో వున్నది. 2018 చివరి నాటికి.. లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు ఒక్క గుజ రాత్లోనే 34,680 నకిలీ రూ.2,000 నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.6.93 కోట్లు. దేశీయంగా చూస్తే.. మొత్తం నకిలీ రూ.2,000 నోట్లలో గుజరాత్ వాటా 26.28 శాతం. ఈ లెక్కన దేశంలో దొంగనోట్ల ముద్రణలో సుమారు సగం వరకు ఉన్నట్టు నివేదిక నిగ్గు తేల్చింది. ఆ తర్వాత.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్లు వరుసగా రూ.3.5 కోట్లు, రూ .2.8 కోట్లు, రూ.2.6 కోట్ల విలువైన నకిలీ రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నకిలీ రూ.2,000 నోట్లు ముద్రణ విస్తరించినట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇవన్నీ స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్ల గణాంకాలు మాత్రమే. మార్కెట్లో వున్న నకిలీ కరెన్సీల సంఖ్యను లెక్కిస్తే... ఈ లెక్కలు తారుమారుకాగలవు. డిసెంబర్ 2018 నాటికి జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాలు ఒక్క నకిలీ రూ.2,000 నోటును కూడా స్వాధీనం చేసుకోలేదని ఎన్సీఆర్బీ తెలిపింది.