Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్యూ ఔన్నత్యాన్ని దెబ్బతీయొద్దు : కేంద్రమంత్రుల్లో భిన్నాభిప్రాయాలు
- దాడులు రాజకీయ ఎత్తుగడ కావద్దంటూ.. పలువురి సూచన
- నా చేతుల్లో ఏం లేదు.. అంతా అమిత్ షానే : ప్రధాని
- కేంద్రహౌంమంత్రిని కలిసి చెప్పే ధైర్యం లేక అమాత్యులు సైలెంట్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఇటీవల విద్యార్థి సంఘం నేతలపై జరిగిన దాడిపై అధికార బీజేపీ అంతర్మథనంలో పడినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలోని కీలక క్యాబినెట్ మంత్రులే ఈ ఘటనపై లుకలుకలు షురూ అయినట్టు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. విద్యార్థులపై దాడులు ప్రభుత్వానికీ, బీజేపీకి రాజకీయ ఎత్తుగడ ఎంతమాత్రం కాకూడదని వారు అన్నట్టు ప్రచారం జరుగుతున్నది. జేఎన్యూ విద్యార్థులను దుండగులు కొట్టిన తీరుపై క్యాబినెట్లో ప్రాధాన్యమైన శాఖలు నిర్వర్తిస్తున్న మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని వారు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర రాజకీయాల మాదిరి కేంద్ర రాజకీయాల్లో భయోత్పాత వాతా వరణ ఎత్తుగడలు సృష్టించి, కొట్టడం వంటి చర్యలు పని చేయవని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆ విధం గా వర్సిటీలోకి వెళ్ళి విద్యార్థులను కొట్టిన పరిస్థితుల్లేవని గుర్తు చేసినట్టు తెలిసింది. యూనివర్సిటీల ఔన్నత్యాన్ని ప్రభుత్వం కాపాడక పోయినా.. హరించవద్దని ఆయా మంత్రులు పీఎం కు సూచించారు. ఇలాంటి విధ్వంసాన్ని చేపడితే భవిష్యత్లో ప్రభుత్వానికే కాకుండా, బీజేపీకి కూడా రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధానమంత్రి మోడీకి పలువురు మంత్రులు సూచనలు అందాయి. మోడీ సర్కార్కు కొరకరాని కొయ్యగా మారిన జేఎన్ యూ విద్యార్థుల పోరాటం, మోడీ సర్కార్ స్పందనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసు కుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనలు నిర్వహి స్తున్న జేఎన్యూ విద్యార్థులను అన్నిరకాలుగా దెబ్బకొట్టేం దుకు మోడీ,అమిత్షా ద్వయం తీవ్రంగా యత్నిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా వర్సిటీ కోర్సులకు 1000 శాతం ఫీజు పెంపు చర్యలు తీసుకొన్నది. ఇలా విద్యా ర్థులను ముందుగా ఆర్థికంగా దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిం చారని జేఎన్యూఎస్యూ మాజీ అధ్యక్షుడు ఎన్ సాయి బాలాజీ అంటున్నారు. ఆ తర్వాత జేఎన్యూలో అపాయింట్ మెంట్ కుంభకోణం ఏబీవీపీ నేతృత్వంలో జరిగిందంటూ.. తీవ్ర ఆరోపణలు బహిర్గతమయ్యాయని తెలిపారు. దీనిపై కూడా జేఎన్యూ విద్యార్థి నేతలు పెద్ద ఎత్తున పోరాడుతున్నందున అటు వర్సిటీ యాజమాన్యానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఈ నేపథ్యంలోనే వీసీ కనుసన్నల్లోనే జేఎన్యూఎస్యూ విద్యార్థులపై ఏబీవీపీ దుండగులు జేఎన్యూఎస్యూ నేతలను దాడి చేశారు. తీవ్రంగా గాయపర్చారు. తమకు సంబంధించిన అంశాల్లో ప్రశ్నించడం, నిరసనలు తెలపడం చేయకూడదనే సందేశాన్ని ఈ దాడితో ఏబీవీపీ శక్తులు ఇస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
అభ్యంతరాలేవనెత్తిన ఆ మంత్రులెవరు?
జేఎన్యూలో విద్యార్థులపై దాడి జరిగిన వెంటనే ఫారేన్ మినిస్టర్ ఎస్ జైశకంర్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇద్దరూ ట్విట్టర్ వేదిక ఈ ఘటనని ఖండించారు. వర్సిటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం సమంజసం కాదని వారు వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు మంత్రులు జేఎన్యూ పూర్వ విద్యార్థులు కావడమే, వర్సిటీ స్వతంత్రత గురించి ఆలోచించి ఈ విధంగా స్పందించారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీల్లో భీతావాహ రాజకీయాలు చేస్తే దాన్ని ఆయా పార్టీలకు రాజకీయ ప్రయోజకనాల కంటే, వ్యతిరేక ఫలితాలే వస్తాయని వారు భావిస్తున్నట్టు తెలిసింది. దాంతోపాటు, ప్రపంచ దేశాల ముందు భారత్ అభాసుపాలు కావాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. మరో కీలక కేంద్ర మంత్రి కూడా ఇదే విషయాన్ని పీఎంఓ దాకా తీసుకెళ్ళినట్టు వినికిడి. వారి అభిప్రాయాలను ఆసాంతం విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ విషయాలన్నీ అమిత్ షా చూసుకుంటున్నారని జవాబిచ్చినట్టు పీఎంఓ వర్గాలు అంటున్నాయి. తాము అన్ని విధాలా ఆలోచించే..భవిష్యత్లో తలెత్తే ఆందోళనలు గురించి వివరించాక కూడా ,, మోడీ స్పందించిన తీరుపై వారంతా నిరాశ చెందినట్టు తెలిసింది.
అణగదొక్కడమే అమిత్ షా అసలు ఎజెండా
బీజేపీ దాని అనుబంధ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని ఢిల్లీ జామియా, జేఎన్యూతో పాటు పలు వర్సిటీల్లో పని చేస్తున్న ఫ్రొఫెసర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. బీజేపీలో అన్నీ తామై నడుపుతున్న మోడీ, షా ద్వయం ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్న విధానం సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తున్నదని అంటున్నారు. పుల్వామా దాడి అనంతరం ఒక కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదనీ... మోడీ సర్కార్ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం? దేశం యావత్తూ పుల్వామా దాడి పట్ల ఆగ్రహంతో, జవాన్ల మృతిపట్ల ఆవేదనతో ఉన్న సమయంలో కేంద్రహౌంమంత్రి మాట్లాడాల్సిన మాటలా? అని చర్చకు దారితీసింది. ఒక మహా విషాదాన్ని కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలనుకోవడం ఏ విధంగా సమర్ధించగలమని వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. అదే పంథాను అవలంభించి, జేఎన్యూలో కూడా భయానక వాతావరణంతో ఆందోళనకారులను అణచివేయాలని హౌంశాఖమంత్రి యత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా లేచే ఉద్యమాలను అణగదొక్కడానికి ఎలాంటి బేషజాలేవీ అమిత్ షాకు ఉండవని ప్రస్తుత పరిణామాలు గమనిస్తే అర్థమవుతున్నదనీ ఢిల్లీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సుకుమార్ రెడ్డి తెలిపారు. జనాన్ని తమ ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే ఏకైక లక్ష్యంగా ఆయన వ్యవహార శైలి ఉంటుందని వెల్లడించారు.