Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23, 26, 30 తేదీల్లో సీఏఏ ఆందోళనలు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి పిలుపు
తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఈ నెల 23న నేతాజీ జయంతి, 26న గణతంత్ర దినోత్సవం, 30న గాంధీ వర్థంతి సందర్భంగా భారీ ఎత్తున ఆందోళనలు జరపాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. తిరువనంతపురంలోని ఇఎంఎస్ అకాడమీలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ... సీఏఏ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతున్నదని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల బీజేపీయేతర పార్టీల సమావేశం జరిగిందని తెలిపారు. ఈనెలలోని ప్రముఖ దినోత్సవాలైన 23, 26, 30 తేదీల్లో నిరసనలను జయప్రదం చేయాలని వివిధ సంస్థలు, రంగాలకు చెందిన మేధావులకు ఆ సమావేశం విజ్ఞప్తి చేసిందని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగాన్ని ప్రజలంతా చదువుతూ సీఏఏపై నిరసన తెలపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు ఏ ఒక్క పార్టీ పిలుపునో కాదని ఏచూరి చెప్పారు. శాంతియుత నిరసనలకు దేశంలోని ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తు న్నామని తెలిపారు. ఇది భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉద్యమ మని అన్నారు. దేశంలోని యువత ఎన్నడూ లేనంతగా రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమిస్తున్నదని చెప్పారు. ఈ ఉద్యమాన్ని సంఘటితం చేసి, బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నికల పొత్తులో భాగంగానో, రాజకీయ కూటమిగానో నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. నిరసనలన్నింటినీ ఒక అజెండాగా ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షపార్టీల సమావేశానికి హాజరుకాని పార్టీలు సైతం సీఏఏకు వ్యతిరేకత తెలిపాయని గుర్తుచేశారు. ఇప్పటికీ సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఆందోళనలు కొనసాగుతున్నాయని వివరించారు.