Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏకు వ్యతిరేకంగా కదంతొక్కిన ముంబయి మహిళలు
ముంబయి: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. షాహీన్బాగ్ ప్రేరణతో.. ముంబయిలోని వైఎంసీఏ మైదానంలో వందలాది మంది మహిళలు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 'నో టు సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీర్' అని రాసిన ఫ్లకార్డులను చేబూని నిరసన తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'దేశ విభజన ఆపండి' అంటూ పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. ఈ సమావేశానికి ఎన్సీపీ నాయకురాలు సుప్రియ సూలేతో పాటు డాక్టర్ అస్మా జహ్రా (ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు), అంజలి అంబేద్కర్, తీస్తా సీతాల్వాడ్, మాలికా ఒబెరారు, జేఏంఐ సభ్యులు నబీహా, చందా యాదవ్, ఏఏంయూ సభ్యులు వార్ధా బేగ్, సువర్ణలు పాల్గొన్నారు. స్థానికులు సైతం భారీస్థాయిలో హాజరయ్యారు.
కలిసి పోరాడుదాం:చిదంబరం
లక్నో: సీఏఏ, ఎన్సీఆర్ల రద్దుకు కలిసి పోరాడుదామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం పిలుపునిచ్చారు. వీటిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కలిసి రావాలని కోరారు. బెంగాల్లోని పార్క్ సర్కస్ మైదనంలో ఆందోళనలు నిర్వహించారు. నిరసనకారులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి తాము పోరాడుతున్నామనీ, రాజ్యాంగా విలువలను కాపాడటానికి అందరూ కలిసి రావాలని చిదంబరం తెలిపారు.
మాజీ ఐఎఎస్ అధికారి కన్నన్ గోపీనాధన్ అరెస్టు
అలహాబాద్ : కేరళకు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి కన్నన్ గోపీనాధన్ను శనివారం అలహాబాద్లో పోలీ సులు అరెస్టు చేశారు. అలహాబాద్లోని ఆల్ ఇండియా పీపుల్స్ ఫోరం నిర్వహించిన సింపో జియంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి ఇక్కడకు వచ్చారు. 'సేవ్ సిటిజన్షిప్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసి'' అనే అంశంపై ఆయన ప్రసంగించాల్సి ఉంది.
విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు తనను అరెస్టు చేశారని మధ్యాహ్నం 2 గంటల సమయంలో గోపినాధన్ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడి ప్రజల ప్రాథమిక హక్కులు అణిచివేతకు గురికావడంపై అసంతృప్తి చెంది ఐఎఎస్ పదవికి రాజీనామా చేయడంతో గోపీనాధన్ వెలుగులోకి వచ్చారు.
'గోబ్యాక్ అమిత్షా' కర్నాటకలో నిరసన సెగలు
సీఏఏ, ఎన్నార్సీ చట్టాలకు అనుకూలంగా 'జనజాగృతి అభియాన్' పేరుతో సదస్సులు నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షాకు కర్ణాటకలో శనివారం నిరసన సెగలు తగిలాయి. 'గోబ్యాక్ అమిత్షా' నినాదాలతో మైసూరు, హుబ్బళ్లి ప్రాంతాల్లో ఆందోళనలు హోరెత్తాయి. స్థానిక మైసూరు బ్యాంక్ సర్కిల్ వద్ద ఆందోళన చేసిన వామపక్ష సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హుబ్బళ్లి వెళ్లిన షాకు వ్యతిరేకంగా సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎసడీపీపిఐ)కు చెందిన వందలాదిమంది కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క హుబ్బళ్లిలోని నెహ్రూ మైదానం సమీపంలో కొందరు అమిత్షాకు నల్లజెండాలు చూపడంతోపాటు నల్ల బెలూన్లను గాలిలోకి ఎగురవేసి నిరసన తెలిపారు. అక్కడి రాణీచెన్నమ్మ సర్కిల్ వద్ద కాంగ్రెస్కు చెందిన వేలాదిమంది కార్యకర్తలు గోబ్యాక్ అమిత్షా అంటూ నెహ్రూ మైదానం వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో 'భీమ్ ఆర్మీ' కార్యాలయం ఉందా?
నివేదిక ఇవ్వండి : పోలీసులకు కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు సంబంధించిన కార్యాలయం ఢిల్లీలో ఉందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించాలని ఢిల్లీ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీని కోసం ఎన్నికల సంఘాన్ని సైతం సంప్రదించాలనీ, ఈ నెల 21లోపు నివేదికను సమర్పించాలని సూచించింది. అలాగే 'రాజకీయ పార్టీ కార్యాలయమేనా? అనే సంగతినీ తెలపాలని ఆదేశించింది. కాగా, గత నెల 20న జామా మసీదు దగ్గర జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలల్లో ప్రజలను ప్రేరేపించినట్టుగా ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో గురువారం విడుదలయ్యారు. ఢిల్లీని సందర్శించకుండా 4 వారాల పాటు కోర్టు షరతు విధించింది. అలాగే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనరాదనీ తెలిపింది. కాగా, తన బెయిల్ ఉత్తర్వుల్లో తనపై విధించిన షరతులను సవరించాలని కోరుతూ ఆజాద్ పిటిషన్ దాఖలు చేశారు. 'సమాజంలోని పేద, బలహీన, అణగారిన వర్గాలు, మైనారీటీల నాయకుడు. వారిలో సామాజిక, రాజకీయ అవగాహన కోసం కృషి చేస్తున్నారు' అని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఈ వారంలో ఢిల్లీలో ఉన్న తన కార్యాలయంలో 'భీమ్ ఆర్మీ ఏక్తా మిషన్' పేరిట వారాంతపు సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టు కార్యాలయ వివరాలతో కూడిన నివేదికను పోలీసుల నుంచి కోరినట్టుగా తెలుస్తున్నది. కాగా, ఈ కేసులో అరెస్టైన మరో 15 మందికి ఈ నెల 9న ఢిల్లీకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రాజకీయ పరమైన వ్యాఖ్యలు తగదు :'దేశాభిమాని' విమర్శ
కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్ రాజ్యాంగపరమైన హోదాలో ఉండి రాజకీయ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సీపీఐ(ఎం) పత్రిక 'దేశాభిమాని' పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది. 'గవర్నర్ పొలిటికల్ గేమ్' అన్న శీర్షికతో రాసిన ఎడిటోరియల్లో రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వ్యక్తిగత ప్రాధాన్యతలకు మించి బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి అని గుర్తు చేసింది. కేరళలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్న ఆందోళనకారులపై గవర్నర్ అనుచిత పదజాలాన్ని వినియోగిస్తూ భయాందో ళనలకు గురి చేస్తున్నారని విమర్శించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందు తనకు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు స్థానిక సంస్థల వార్డు విభజనకు సంబంధించిన ఆర్డినెస్స్పై సంతకం చేయించకపోవడంపై పినరరు విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రానికి ఎటువంటి నిర్ణయాలు తీసు కునే స్వతంత్ర అధికారం లేదని, రాజ్యాంగ బద్ధంగా హామీనిచ్చిన హక్కులపై కూడా గవర్నర్ అనుమతి కోసం వేచి చూడాలని భావిస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది.
రాష్ట్రాలు అమలు చేయాల్సిందే.. : కేరళ గవర్నర్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కేంద్ర జాబితాలోని అంశమనీ, దీనిని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందేనని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ చట్టాన్ని అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదు. దీనిని (ఆర్టికల్) 254 కింద అమలు చేయాల్సి ఉంటుంది' అని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలు సీఏఏను అమలు చేయడానికి నిరాకరించే క్రమంలో తమ పరిధిని అర్థం చేసుకోవాలని చెప్పారు. 'మీరు మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మీ వాదనలు వినిపించవచ్చు. అలాగే సుప్రీంకోర్టులో సవాలు చేసే హక్కు మీకు ఉంది. కానీ సీఏఏ యూనియన్ జాబితాలోని అంశం. రాష్ట్రానికి సంబంధంలేదు' అని చెప్పారు.