Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం అనుమతించిన 153 సైట్లలోనే బ్రౌజింగ్
శ్రీనగర్: ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు జమ్మూకాశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు సంబంధిత అధికారులు శనివారం వెల్లడించారు. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కాశ్మీర్లోని బండిపొరా, కుప్వారా జిల్లాలతో పాటు జమ్మూలోని 10జిల్లాల్లో పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్లపై 2జీ ఇంటర్నెట్ సేవలనూ పునరుద్ధరించనున్నట్టు సంబంధిత అధికారి రోహిత్ కన్సాల్ వెల్లడించారు. అయితే, ప్రభుత్వం అనుమతించిన 153 సైట్లలో మాత్రమే బ్రౌజింగ్ చేసేలా పలు ఆంక్షలు విధించామని తెలిపారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే ముందు సబ్స్క్రైబర్లను ధ్రువీకరించుకోవాలని టెలికాం ఆపరేటర్లకు సూచించారు. కాగా, ఆర్టికల్ 370రద్దు నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5నుంచి కేంద్రప్రభుత్వం జమ్మూకాశ్మీర్లో అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం.. స్వదేశంలోనే కాకుండా ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రభుత్వంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలనుంచీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతోపాటు ఇటీవలే సుప్రీంకోర్టు సైతం ఈ అంశంపై కేంద్రానికి చురకలంటించింది. ఇంటర్నెట్ ఆంక్షలను సవాలు చేస్తూ.. కోర్టులో ఓ పిటిషన్ దాఖలవ్వగా, దానిపై కోర్టు స్పందిస్తూ.. ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కులో భాగమేననీ, ఆంక్షలు విధించడం తగదని వ్యాఖ్యానించింది. ఆంక్షలపై వారంలో పున:పరిశీలించాలని ఆదేశించింది.