Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక మూడు నెలల పాటు పెండింగ్లోనే..!
- టీడీపీ హర్షం.. వైసీపీ నిరసన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ మేరకు శాసనమండలి చైర్మెన్ షరీఫ్ సభలో ప్రకటన చేశారు. ఈ బిల్లుపై రూల్ 71 ప్రకారం చర్చకు అనుమతించాల్సిందేనని మంగళవారం తన పంతం నెగ్గించుకున్న టీడీపీ.. దీనిని మరింత లోతుగా చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టింది. దీనిపై ఓటింగ్ జరపాలని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అయితే దీనిని సెలెక్ట్ కమిటీకి పంపే అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఈ సమయంలోనే ఓటింగ్పై టీడీపీ పట్టుబట్టడంతో పలువురు మంత్రులు, టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైంది. సభలో మెజారిటీ దృష్ట్యా ఈ బిల్లును
సెలెక్ట్ కమిటీకి పంపించడంలో టీడీపీ సఫలమైంది. తనకున్న విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు స్పీకర్ తెలిపారు. దీనిపై టీడీపీ హర్షం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ తీవ్ర నిరసన తెలిపింది. సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఈ బిల్లులు మూడు నెలల పాటు పెండింగ్లో ఉండే అవకాశం ఉంది. దీంతో వైసీపీ సర్కారు వేగానికి బ్రేకులు పడ్డాయి.
వ్యూహం విఫలం అంతకుముందు వికేంద్రీకరణ బిల్లును ఎట్టిపరిస్థితిల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ఉన్న వైసీసీ సర్కారు వ్యూహం దారుణంగా విఫలమైంది. ఈ బిల్లును ఆగమేఘాల మీద ముగించాలని భావిస్తున్న జగన్ సర్కారు.. సెలెక్ట్ కమిటీకి పంపకుండా శాయశక్తులా ప్రయత్నించింది. అవసరమైతే బిల్లు వీగిపోయినా పర్వాలేదనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నా సంఖ్యాబలం ఎక్కువ ఉండటంతో చివరికి టీడీపీ తన పంతం నెగ్గించుకుంది.