Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెమోక్రసీ ఇండెక్స్'లో భారత్కు 51వ స్థానం
- 10 స్థానాలు దిగజారి అప్రజాస్వామిక దేశాల జాబితాలోకి
- పౌర స్వేచ్ఛ దెబ్బతినటం, సీఏఏ, ఎన్నార్సీలు కారణం
న్యూఢిల్లీ : గతంలో లేనంతగా భారత్లో ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యాయని తాజాగా ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. క్రితం ఏడాదితో పోల్చితే 2019లో భారత్ ర్యాంక్ పది స్థానాలు దిగజారిందనీ, 'ప్రజాస్వామ్య సూచిక'లో 51వ స్థానంలో నిలబడిందనీ 'డెమోక్రసీ ఇండెక్స్' నివేదిక పేర్కొన్నది. ప్రజాస్వామ్య దేశాల్లో 9.87 మార్కులతో నార్వే తొలి స్థానంలో నిలించింది. 2006 నుంచి 'ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్' వారు ప్రతిఏటా 165 దేశాలకు సంబంధించి ఈనివేదికను విడుదలచేస్తున్నారు. తాజాగా 2019ఏడాదికి సంబంధించి నివేదిక విడుదలైంది. భారత్కు 2017లో 42వ ర్యాంకు, 2018లో 41వ ర్యాంకు రాగా, ఈసారి 51వ ర్యాంకుకు పడిపోయింది. 2018లో భారత్ స్కోర్ 7.23కాగా, ఈసారి అది 6.90కి దిగజారింది. 2006తర్వాత భారత్ ర్యాంకు ఈస్థాయిలో పడిపోవటం ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఈనివేదికలోని మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా పౌరహక్కులకు భంగం కలగటం, దాంతో
పౌరస్వేచ్ఛకు ప్రజలు దూరమవ్వటం భారత్ స్కోర్ పడిపోవటానికి కారణమని నివేదిక తెలిపింది. ఎన్నికల నిర్వహణ, పౌర హక్కులు, ప్రభుత్వ పాలన, రాజకీయ ప్రాతినిథ్యం, సంస్కృతీ...విభాగాల్లో ఆయా దేశాల పనితీరును మదింపు చేసి ఈ ర్యాంకులు ఇచ్చినట్టు వెల్లడించారు. అలాగే 60రకాల సూచికల్లో ఆయా దేశాలు అందుకున్న స్థానాల్ని సైతం పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు.
స్కోరింగ్, ఇతర అంశాల పరిశీలన అనంతరం ప్రపంచదేశాల్ని...ప్రజాస్వామ్య దేశాలు, అప్రజాస్వామిక దేశాలు, నామమాత్రపు ప్రజాస్వామ్యం, నియంతృత్వ పాలన... నాలుగు రకాలుగా విడగొట్టారు. ఇందులో భారత్ను 'అప్రజాస్వామిక' దేశంగా పేర్కొనటం గమనార్హం. ఎన్నార్సీ, సీఏఏ, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్లో నిర్బంధాలు...వంటి అంశాలతో భారత్ అట్టుడుకిపోయింది. కాశ్మీర్లో పెద్దఎత్తున కేంద్ర బలగాలను మోహరించటం, ఇంటర్నెట్ సేవల్ని స్తంభింపజేసి పాలకులు పౌర హక్కుల్ని కాలరాశారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అసోంలో ఎన్నార్సీ ప్రక్రియ వల్ల లక్షలాది మంది భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని నివేదికలో పేర్కొన్నారు.