Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణతంత్ర దినోత్సవం నాడు 22 వేల మంది పోలీసులతో పహారా
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీకి రక్షణ కల్పించడానికి భారీగా పోలీసు, భద్రతా బలగాలు మోహరించాయి. రక్షణ చర్యల్లో భాగంగా దాదాపు 22 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడూ 48 కంపెనీలకు చెందిన సీఏపీఎఫ్ సిబ్బంది సైతం పహారా కాస్తున్నాయి. పోలీసులు అధికారిక, సాధారణ దుస్తుల్లో ఉండనున్నారని అధికారులు తెలిపారు. మల్టీ లేయర్ పద్దతిలో రక్షణ కల్పించనున్నట్టు చెప్పారు. దీనికోసం ఢిల్లీ పోలీసుల ప్రత్యేక 'స్వాట్ టీం' చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాగా, రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి రక్షణ కల్పించడంలో ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఐటీబీపీ సిబ్బంతో కలిసి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ను నిర్వహించారు. పోలీసులతో పాటు పలు కంపెనీలకు చెందిన సిబ్బంది సంయుక్తంగా రక్షణ చర్యలు చేపడతాయని అధికారులు వెల్లడించారు. వేడుకలు జరిగే రాజ్పథ్లోని ప్రధాన వేదికకు ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్టు వివరించారు. అలాగే రాష్ట్రపతి భవన్లో జరిగే ఎట్హౌం ఫంక్షన్ కోసం భద్రత కల్పించటంతో పాటు ట్రాఫిక్కు సంబంధించిన ఏర్పాట్లనూ పూర్తి చేసినట్టు వివరించారు. ఇప్పటికే అన్ని జిల్లాల డీసీపీలు గణతంత్ర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. మార్కెట్లు, మాల్స్తో పాటు ఎత్తైన ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తారని తెలిపారు. అలాగే గణతంత్ర వేడుకలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు, అనుమానితులను గుర్తించడానికి ఫేసియల్ రికగ్నైజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామనీ, ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. డ్రోన్ దాడులు జరిగే అవకాశముందనే నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో.. యాంటీడ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే బాంబులను, డిటోనేటర్లను, అనుమానాస్పద వస్తువులను గుర్తించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే స్పందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.