Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ మత విభజన నిర్ణయాలు హింసకు దారి తీస్తాయి : బ్రిటన్ పత్రిక 'ది ఎకనామిస్ట్' కథనం
లండన్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకున్నదని లండన్ నుంచి వెలువడే వార పత్రిక ది ఎకనామిస్ట్ వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం, జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ) అంశం దేశంలోని 20 కోట్ల ముస్లింల్లో భయాన్ని కలిగించాయని ఆ పత్రిక పేర్కొన్నది. తాజా సంచిక కవర్ స్టోరీని 'అసహన భారత్'(ఇన్టాలరెంట్ ఇండియా) పేరుతో ఆ పత్రిక ప్రచురించింది.
బహుళ మతాలతో సహనశీలంగా ఉన్న దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఓ ప్రణాళికగా తన విధానాలను అమలులో పెడ్తోందని ఎకనామిస్ట్ వివరించింది. మత విభజన విధానాలను అనుసరిస్తూ 80 శాతంగా ఉన్న హిందువులకు మోడీని ఓ రక్షకుడుగా చూపించడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతోందని పేర్కొన్నది.
రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విఘాతం కలిగించడం వల్ల భారత ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని, సీఏఏలాంటి నిర్ణయాలు రక్తపాతానికి దారి తీస్తాయని, కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుందని ఆ పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడినవేళ పౌరుల దృష్టి మళ్లించడంలోనూ తాజా నిర్ణయాలు బీజేపీ సర్కార్కు కలిసి వస్తున్నాయని తెలిపింది. ఎన్నార్సీ పేరుతో జరిగే ప్రక్రియలోని అంశాలు, మత విభజన ద్వారా జాతీయతను గుర్తించడంలాంటివి మరో ఐదేండ్ల సాగదీతకు ఉపయోగపడ్తాయని కూడా ఆ పత్రిక పేర్కొన్నది.
బీజేపీ ఖండన
ది ఎకనామిస్ట్ పత్రిక నిర్వాహకులు ఇంకా వలసవాద మనస్తత్వంతో అహంకారంతో ఈ రకమైన కథనాన్ని ప్రచురించారంటూ బీజేపీ విదేశాంగ విధానాల ప్రతినిధి విజరుచౌతాయివాలా ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చారు. '1947లోనే బ్రిటీష్వాళ్లు దేశాన్ని వీడి వెళ్లారని మేం భావిస్తున్నాం. కానీ, ది ఎకనామిస్ట్ ఎడిటర్లు మాత్రం ఇంకా వలసవాద దశలోనే జీవిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు.
నిరసనలే ప్రజాస్వామ్య మూలాలకు బలం : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలే ప్రజాస్వామ్య మూలాలకు బలం చేకూరుస్తామని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శాంతియుత నిరసనలే ప్రజాస్వామ్యంలో మరింత చైతన్యం నింపుతాయని వెల్లడించారు. భారత తొలి ఎన్నికల అధికారి (సీఈసీ) సుకుమార్ సేన్ను సత్కరిస్తూ ఎన్నికల సంఘం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఏకాభిప్రాయమే జీవనాధారమనీ, అలా జరిగినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని తెలిపారు. చర్చించడం, వాదించడం, భిన్నాభిప్రాయాలను కూడా వినడం ద్వారానే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భారత ప్రజాస్వామ్యం మరోసారి పరీక్షను ఎదుర్కొంటున్నదని వెల్లడించారు. కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారనీ, ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. వారికి రాజ్యాంగంపై ఉన్న నమ్మకం హృదయాలను కదిలిస్తున్నదన్నారు. కాగా, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మహారాష్ట్ర బంద్ ప్రశాంతం
ముంబయి : పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వంచిత్ బహుజన్ అగాడి (వీబీఏ) పిలుపు ఇచ్చిన మహారాష్ట్ర బంద్ విజయవంతమైంది. ముంబయితో పాటు పూణె, ఔరంగాబాద్, సోలాపూర్, సింధుదుర్గ్, కొల్హాపూర్, నాసిక్, ధూలె, నందర్భర్, ఉస్మానాబాద్, బీడ్, జల్నా, ప్రభాని, లాతూర్, నాగ్పూర్, అకోలాలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. సీఏఏను నిరసిస్తూ వీబీఏ కార్యకర్తలు పెద్దఎత్తున రోడ్ల మీదకు వచ్చి ర్యాలీ తీశారు. ముంబయిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల్ని విధించడమే గాక భారీ ఎత్తున పోలీసులను మొహరించారు. వీబీఏ ఇచ్చిన బంద్ పిలుపునకు ఏఐఎంఐఎంతో పాటు పలు రాజకీయ పార్టీలు, పౌర, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి.
బంద్ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రకాశ్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. దేశంలో అశాంతి నెలకొన్నదని ఆరోపించారు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే మోడీ సర్కారు సీఏఏ, ఎన్నార్సీలను తీసుకొచ్చిందని విమర్శించారు. వివాదాస్పదమైన ఈ రెండింటిని దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాక బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని ఆయన ఆరోపించారు.
సీఏఏపై సమాధానం దాటవేసిన నితీశ్
పాట్నా : సీఏఏపై తమ వైఖరి తెలియజేయాలని అడిగిన ప్రశ్నకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమాధానం దాటవేశారు. నితీశ్పై ఇటీవలే జేడీ(యూ) జాతీయ కార్యదర్శి పవన్ వర్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగానే గాక జాతీయస్థాయిలోనూ పెనుదుమారం లేపడంతో ఆయన ఎక్కడికెళ్లినా విలేకరులు దీనిపై స్పష్టతనివ్వమని ప్రశ్నిస్తున్నారు. కానీ నితీశ్ మాత్రం సీఏఏపై తన స్పష్టమైన వైఖరిని ఇప్పటివరకూ తెలియజేయలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ను చుట్టుముట్టిన విలేకరులు సీఏఏపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై స్పందన తెలియజేయాలని కోరగా దానికి ఆయన నిరాకరించారు. నితీశ్ నేతృత్వంలోని జేడీ(యూ).. పార్లమెంటులో ఈ చట్టానికి అనుకూలంగా ఓటేసిన విషయం తెలిసిందే.
సీఏఏ రాజ్యాంగ విరుద్ధం..
వెంటనే వెనక్కి తీసుకోవాలి : యశ్వంత్ సిన్హా
జైపూర్ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ విరుద్ధమనీ, కేంద్ర ప్రభుత్వం దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తలెత్తిన హింసాకాండపై జ్యుడీషియల్ దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తున్నదనీ, ఇలా ఎంతోకాలం మనుగడ సాగించలేరని యశ్వంత్ సిన్హా విమర్శించారు. 'వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం సహా దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. అశాంతి వాతావరణం నెలకొని వున్నది. కుల, మతాల ప్రాతిపదికన ఎలాంటి వివక్షా లేకుండా ప్రభుత్వం తన రాజ్యాంగ విధిని నెరవేర్చాలి' అన్నారు.
దేశ భవిష్యత్ను నాశనం చేస్తున్నారు : మేధాపాట్కర్
ముంబయి : సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ద్వారా దేశ భవిష్యత్తును కేంద్ర సర్కార్ నాశనం చేస్తున్నదని ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ విమర్శించారు. సీఏఏను నిరసిస్తూ.. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని బంద్రాలో జరిగిన భారీ బహిరంగసభనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రధాన సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 'దేశ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నాల్లో భాగమే సీఏఏ, ఎన్నార్సీ. రాజకీయ లబ్ధికోసమే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తున్నది. లాభాల్లో వున్న ప్రభుత్వరంగ సంస్థను ప్రయివేటు పరంచేస్తున్న సర్కార్ చాలా తెలివిగా ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నది' అని ఆమె ఆరోపించారు. జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా, షాహీన్బాగ్ను సందర్శించి, వారితో చర్చించే ధైర్యం మోడీ సర్కార్కు లేదన్నారు. 'నిరసనకారులకు మేం సెల్యూట్ చేస్తున్నాం. ముస్లిం మహిళలు పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఇది చాలా పెద్ద విజయం' అన్నారు.
ప్రజా వ్యతిరేక చట్టాన్ని స్వాగతించేది లేదు : నందితా దాస్
జైపూర్ : పౌరసత్వ సవరణ చట్టంపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, డైరెక్టర్ నందితా దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేక చట్టాన్ని స్వాగతించేది లేదని స్పష్టం చేశారు. జైపూర్లో నిర్వహించిన లిటరరీ ఫెస్టివల్లో నందితా దాస్ పాల్గొన్నారు. పౌరసత్వసవరణ చట్టంకు వ్యతిరేకంగా విద్యార్థులు, సామాన్య ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారనీ, ముఖ్యంగా యువత చేస్తున్న పోరాటం అభినందనీయమని నందిత అన్నారు. షాహీన్బాగ్లో నాలుగు తరాలుగా నివాసముంటున్న వారిని భారతీయులుగా నిరూపించుకోవాలని మోడీ ప్రభుత్వం కోరాడం సరికాదన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలూ షాహీన్ బాగ్ అవ్వాలని ఆమె ఆకాంక్షించారు. దేశ ఆర్థిక సంక్షోభంపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగ సమస్యతో దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రభుత్వం ముందు ఈ సమస్యలపై స్పందించాలని తెలిపారు.