Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై మహానగరంలో సీఐటీయూ భారీ మానవహారం
- మహాసభ ప్రాంగణంలో త్రివర్ణ పతాక రెపరెపలు
చెన్నై నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
'ఇండియా జిందాబాద్...సెక్యులరిజం జిందాబాద్' అని సీఐటీయూ 16వ అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైలోని కామ్రేడ్ అమీన్నగర్లో త్రివర్ణ పతాకాన్ని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె. హేమలత ఆదివారం ఎగురవేశారు. ఈ సందర్భంగా హేమలత..మహాసభ ప్రతినిధులతో ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకిస్తూ రాజ్యాంగ పీఠికను చదువుతూ అందరిచేతా లౌకిక రాజ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రతినిధులందరూ 'జిందాబాద్..జిందాబాద్..వర్కర్స్ యూనిటీ జిందాబాద్, జిందాబాద్.. జిందాబాద్ పీపుల్స్ యూనిటీ జిందాబాద్, బచాయింగే..బచాయింగే సంవిధాన్ బచాయింగే...జిందాబాద్ జిందాబాద్... జన్ఏక్తా జిందాబాద్...అంటూ పెద్దపెట్టున నినదించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం మహాసభ ప్రాంగణం బయట ఉన్న రాయపేట రోడ్డులో కిలోమీటర్ దూరం వరకు ప్రతినిధులు 'నో ఎన్నార్సీ..నో ఎన్పీఆర్..నో సీఏఏ...సీఐటీయూ జిందాబాద్...' అని రాసిఉన్న ప్లకార్డులు చేతబూని మానవహారం చేపట్టారు. అరుణపతాకం పక్కనే త్రివర్ణపతాకం రెపరెపలాడటం మహాసభకు ప్రత్యేక శోభను తెచ్చిపెట్టింది. ప్రతినిధులందరూ ఎర్రజెండా, జాతీయజెండాల వద్ద ఫొటోలు దిగారు.