Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకికతత్వాన్ని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ
- 620 కిలోమీటర్లు.. 60 లక్షల మంది ప్రజలు
- కేరళలో ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో భారీ మానవహారం
కేరళ: కనీవినీ ఎరుగని రీతిలో అసలు సిసలైన గణతంత్ర స్ఫూర్తిని దేశ ప్రజానీకం ఈ ఏడాది చాటింది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మన దేశాన్ని చాటి చెప్పిన రాజ్యాంగాన్ని 70 ఏండ్ల తర్వాత మరోమారు పున:సమర్పించుకొంటూ ఆసేతుహిమాచలం సామూహిక రాజ్యాంగ ప్రవేశికను పఠనం చేసింది. ప్రజల పౌరసత్వాన్ని శంకిస్తూ, వారి ఉనికిని ప్రశ్నిస్తూ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని మంట గలిపి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ నిరంకుశ చట్టాలను తిప్పికొట్టాలని ప్రజానీకం ప్రతిన బూనింది. కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) నేతృత్వంలో 620 కిలోమీటర్ల మేర 70 లక్షల మంది ప్రజలు అపూర్వమైన రీతిలో మహా మానవహారం చేపట్టి ఈ నిరంకుశ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినదించారు. న్యూఢిల్లీలోని షహీన్బాగ్లో వేలాది మంది మహిళలు 'బీజేపీ సే అజాదీ..సీఏఏ సే అజాదీ.. ఎన్నార్సీ సే అజాదీ' అంటూ ఢిల్లీ మార్మోగేలా నినదించారు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటా సామూహిక రాజ్యాంగ పీఠిక పఠనాలతో ప్రజలు గణతంత్ర స్ఫూర్తిని చాటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించారు.
పౌర చట్టానికి వ్యతిరేకంగా పలు మార్గాల్లో పోరాడుతున్న కేరళలోని అధికార వామపక్ష ప్రభుత్వం.. ప్రజాపోరాటాలతో ముందుకెళ్తున్నది. వివాదాస్పద సీఏఏను నిరసిస్తూ సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తర కేరళలోని కాసర్గోడ్ నుంచి దక్షిణాన కాలియక్కవిలై వరకు 620 కిలోమీటర్ల మేర ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది ప్రజలు పాల్గొనడం గమనార్హం. అనంతరం వారంతా రాజ్యాంగ పీఠికను చదివారు. అలాగే రాజ్యాంగానికి తూట్లు పొడిచే కేంద్ర ప్రయత్నాల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రమాణం చేశారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన వీటిని అమలుపరచకూడదని డిమాండ్ చేశారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో భాగంగా తిరువనంతపురంలోని ప్రదర్శన వేదిక వద్ద రాష్ట్ర సీఎం పినరయి విజయన్, సీపీఐ రాష్ట్ర సెక్రెటరీ కానం రాజేంద్రన్లు ఉన్నారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎస్ రామచంద్రన్ పిళ్లై ఈ భారీ మానవహారానికి మొదటి వ్యక్తిగా కాసర్గోడ్లో, చివరి వ్యక్తిగా ఎం.ఎ బేబీ కాలియక్కవిలైలో పాల్గొన్నారు. అలాగే పలురంగాలకు చెందిన ప్రముఖులు, సామాజిక, ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.