Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఐక్యతకు ఆ చట్టం భంగం
- చతికిలపడ్డ జాతీయ పార్టీలు... ప్రాంతీయ పార్టీలదే హవా
- నోట్లరద్దుకు మద్దతిచ్చి చింతిస్తున్నాం : మంత్రి కేటీఆర్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశ ఐక్యతకు భంగం కల్గిస్తున్న పౌరసత్వ చట్ట సవరణ(సీఏఏ)ను తమ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. పౌరసత్వం మత ప్రాతిపదిక ఇవ్వడం సముచితం కాదన్నారు. పార్లమెంట్లో తమ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించిందని వివరించారు. గతంలో నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నామని అన్నారు. ప్రధాని
మోడీ మాటలపై విశ్వాసంతో రాష్ట్ర అసెంబ్లీలో కూడా నోట్ల రద్దుకు మద్దతుగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. కానీ ఇందుకు భిన్నంగా నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆటంకం కలిగించిందన్నారు. 'యూనిటీ ఇన్ డైవర్సిటీ' అనే సూత్రాన్ని టీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతున్నదని చెప్పారు. గురువారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ నిర్వహించిన తొలి సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. 'భారతదేశ నిర్మాణం - రాష్ట్రాల కీలక పాత్ర' అనే అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన డిబేట్లో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమే ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రీజినల్ పార్టీస్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని వ్యాఖ్యానించారు. అందువల్లే ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ఒక రకంగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే అని చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశంలో కర్నాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో బీజేపీ చాలా బలహీనంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో దేశం నడిచే రోజు త్వరలోనే వస్తుందని ధీమాభావం వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామం చాలా కీలకమైందని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా రాష్ట్రాల అభివ ృద్ధికి నిధులను విడుదల చేసినప్పుడే, దేశ ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నారు. బలమైన దేశాన్ని నిర్మించాలంటే, రాష్ట్రాలను బలపర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, దేశ ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రెండు జాతీయ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదన్నారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ ఆలోచనలు, భావాజాలంలో తేడాలు ఉన్నంత మాత్రానా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం... రాష్ట్రాలను, ఇతర పార్టీలను శత్రువులుగా చూడటం సరికాదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిరంకుశంగా పాలించి నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మోడీ, రాహుల్లను జాతీయ నాయకులుగా అన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన తాము ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదే రీతిలో వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా... వాటి ఆచరణ మాత్రం అంతా రాష్ట్రాల్లో ఉంటుందని వెల్లడించారు. మేకిన్ ఇండియా అంటే దేశంలో పారిశ్రామిక రంగాన్ని బలపర్చే విధానమని అన్నారు. అందుకోసం కేంద్రానికి రాష్ట్రాల సహకారం తప్పని సరి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పరిశ్రమల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల సహకారం వంటి అంశాలు కీలకమని గుర్తు చేశారు.
రాష్ట్రాలతోనే కేంద్రానికి నిధులు
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సొంత నిధులు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వ్యాఖ్యానించారన్నారు. అయితే, సీతారామన్ వ్యాఖ్యాలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాలు పన్నులు, ఇతర రూపాల్లో కేంద్రానికి నిధులు సమకూర్చుతున్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తే, రాష్ట్రానికి కేంద్రం కేవలం రూ. 1.15 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఇంకా 1.60 లక్షల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని గుర్తు చేశారు. నిటి ఆయోగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా... ఇప్పటి దాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కోరారు. దేశానికి రెండవ జాతీయ రాజధానిగా హైదరాబాద్ ప్రస్తావనకు వస్తే... ఇందుకు ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో తనకు అనుమానం ఉందని కేటీఆర్ చెప్పారు.