Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాన్ని వ్యతిరేకించినంత మాత్రాన వారిని అలా అనలేం
- నిరసన తెలిపే హక్కు వారికి ఉంది.. శాంతియుత నిరసనలతోనే భారత్కు స్వాతంత్య్రం వచ్చింది
- రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి.. మెజారిటీ పరంగా కాదు: బాంబే హైకోర్టు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై దేశద్రోహం కేసులు పెట్టడానికి చెక్ పెట్టేలా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై నిరసన వ్యక్తం చేస్తున్నవారిని బీజేపీ అగ్రనాయకుల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు దేశవ్యతిరేకులంటూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఒక చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తే వారిని దేశద్రోహులు, జాతివ్యతిరేకులుగా పిలవలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిరసన తెలిపేందుకు పోలీసులు, జిల్లా మేజిస్ట్రేటు తనకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఇఫ్తిఖార్ షేక్ అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్ పై విధంగా స్పందించింది. బీడ్ జిల్లా మేజిస్ట్రేటు, పోలీసుల తీరును తప్పుబట్టింది. నిరసన తెలుపుకోవచ్చని పిటిషనర్కు కోర్టు అనుమతినిచ్చింది.
''ఒక చట్టాన్ని వ్యతిరేకించినంత మాత్రాన శాంతియుత నిరసనకారులను దేశద్రోహులు, జాతివ్యతిరేకులుగా పిలువలేం. ఎందుకంటే వారు ఒక చట్టాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారు. ఇది ఒక నిరసన చర్య. ఇది సీఏఏ కారణంగా కేవలం ప్రభుత్వానికే వ్యతిరేకం'' అని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు టి.వి. నలవడే, ఎం.జి స్యూలికార్లు అభిప్రాయపడ్డారు. ''అహింసాయుత పద్దతులలో చేపట్టిన ఆందోళనలు, నిరసనప్రదర్శనలతోనే భారత్.. స్వాతంత్య్రాన్ని పొందింది. అదృష్టవశాత్తు ఇప్పటికీ ఈ దేశంలోని అనేక మంది ప్రజలు అహింసాయుత మార్గంలోనే నడుస్తున్నారు. ప్రస్తుత అంశంలోనూ పిటిషనర్లు తమ నిరసనను తెలియజేయడానికి శాంతియుత మార్గంలో ఆందోళన చేయాలనుకుంటున్నారు'' అని కోర్టు తెలిపింది.
'' మనది ప్రజాస్వామ్య గణతంత్ర దేశమని గుర్తుంచుకోవాలి. మనం మన దేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. మెజారిటీ ఆధారంగా కాదు. సీఏఏ తమ ప్రయోజనాలకు విరుద్ధమని భావించి ఒక వర్గానికి చెందిన ప్రజలు దానిని వ్యతిరేకించొచ్చు. అది వారి నమ్మకం. నిరసనలు చేసే హక్కు వారికి ఉంది. న్యాయస్థానం అందులో జోక్యం చేసుకోదు'' అని బెంచ్ చెప్పింది.
నిరసనకారులతో ప్రభుత్వం చర్చించాలి
కాగా, ఇదే సందర్భంలో నిరసనకారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలనీ కోర్టు తెలిపింది. ''ఇలాంటి అంశాల్లో నిరసనకారులతో ప్రభుత్వం మాట్లాడాలి. వారిని ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం కేంద్రం బాధ్యత'' అని న్యాయమూర్తులు తెలిపారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాలలో అనేక మంది ప్రజలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల నుంచి వందలాది మంది మహిళలతో దక్షిణ ఢిల్లీలోని షాహీన్బాగ్లో జరుగుతున్న నిరసనలు దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. వీరి నిరసనలు మొదలైనప్పటి నుంచి మొన్నటి ఢిల్లీ ఎన్నికల వరకూ ఆందోళనకారులపై కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు తమ నోటికి పనిచెప్పారు. చివరకు ఢిల్లీ ఎన్నికల్లో ఓటరు బీజేపీకి గట్టి సమాధానం చెప్పడంతో ఆ పార్టీ కోలుకోలేని అపజయాన్ని మూటగట్టుకున్నది.
బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలి
పౌర నిరసనకారులపై లాఠీచార్జి సరికాదు:
డీఎంకే సహా తమిళనాడు ప్రతిపక్షాల ఖండన
చెన్నై : వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసనలు చేపట్టినవారిపై పోలీసులు విరుచుకుపడి వీరంగం సృష్టించడాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా పలు పార్టీలు తప్పుబట్టాయి. పోలీసుల తీరును ఖండించాయి. లాఠీచార్జితో ఈ హింసాత్మక ఘటనలో బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు ఎందుకు లాఠీచార్జి చేశారని డీఎంకే చీఫ్ ఎం.కె స్టాలిన్ ప్రశ్నించారు. ఈ ఘటనలో నిరసనకారులపై ఏవైనా కేసులుంటే వాటిని వెనక్కి తీసుకోవాలనీ, లాఠీచార్జికి దిగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సీఏఏకు అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేసిన అధికార ఏఐఏడీఎంకే.. సదరు చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న తమ డిమాండ్ను మాత్రం పట్టించుకోవడంలేదని స్టాలిన్ ఆరోపించారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం నాయకుడు, ఎమ్మెల్యే టి.టి.వి దినకరన్ తప్పుబట్టారు. రాష్ట్ర సర్కారు తీరుపై ఆయన ఆరోపణలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుడదని తాను కోరుకుంటున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎండీఎంకే నేత వైకో కూడా పోలీసుల చర్యను తప్పుబట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా ఓల్డ్ వాషర్మెన్పేట్లోని లాలాగుండలో శుక్రవారం ముస్లిం సంఘాలు చేపట్టిన నిరసనలపై రాష్ట్ర పోలీసులు విరుచుకుపడటంతో హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఫలితంగా పోలీసుల తీరును నిరసిస్తూ చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. కడ్డలూరు, రామనాథపురం వంటి జిల్లాల్లో శుక్రవారం నాటి ఘటనతో పాటు సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి.
సంఘీభావంగా దీక్షకు దిగినందుకు..
విద్యార్థులను అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు
లక్నో : సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలాంటి నిరసనలు జరిగినా యోగి సర్కారు మాత్రం సహించడంలేదు. ఆందోళనలకు దిగుతున్న నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నది. పౌర చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన పది మందిని ఘాజీపూర్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం యూపీ సర్కారు అరెస్టు చేసింది. అయితే అరెస్టు అయినవారికి సంఘీభావంగా ఘాజీపూర్ జిల్లా హెడ్క్వార్టర్ ముందు శనివారం 12 మంది విద్యార్థులు, స్థానిక యువకులు నిరాహార దీక్షకు దిగారు. శాంతియుతంగా నిరసనచేస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. '' జిల్లా హెడ్క్వార్టర్కు బయట శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా పోలీసులు అనుమతించలేదు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మళ్లీ ఎప్పుడు విడుదలవుతారో అన్న విషయంపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు'' అని బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్యూ) విద్యార్థి ధనంజరు ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబయి, చెన్నై, కోల్కతాలో భారీ నిరసనలు
ముంబయి, చెన్నై, కోల్కతా : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. ప్రధానంగా ముంబయి, చెన్నై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా ముస్లింలు ఈ నిరసన కార్యక్రమాల్లో తమ కుటుంబాలతో కలిసి పాల్గొనడం కనిపించింది.
చెన్నైలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. 'నో సీఏఏ, నో ఎన్నార్సీ, నో ఎన్పీఆర్' అని రాసి ఉన్న రిబ్బన్లను తలలకు కట్టుకొని కనిపించారు. జాతీయ జెండాలను, సీఏఏ వ్యతిరేక బ్యానర్లను చేతిలో పట్టుకొని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముంబయిలోని ఆజాద్ మైదాన్లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో తమ చిన్నారులతో కలిసి మహిళలు పాల్గొన్నారు. పౌర వ్యతిరేక నినాదాలతో హౌరెత్తించారు. వేలాది మంది నిరసనకారుల రాకతో ఆజాద్ మైదాన్ కిక్కిరిసిపోయింది.
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వద్దంటూ కోల్కతాలో ర్యాలీ జరిగింది. కలకత్తా ఖిలాఫత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో మహిళలతో సహా వందలాది మంది పాల్గొన్నారు.
బీదర్ దేశద్రోహం కేసుపై కాంగ్రెస్ నిరసన మార్చ్
- సిద్ధరామయ్య సహా పలువురి అరెస్టు
'బీదర్ దేశద్రోహం' కేసును నిరసిస్తూ బెంగళూరులోని కర్నాటక సీఎం యడియూరప్ప ఇంటికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్న ఈ నిరసన ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. సిద్ధరామయ్య సహా ఇతర నాయకులు దినేశ్ గుండూరావు, రిజ్వాన్ అర్షద్, కె సురేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల అధికారాలను దుర్వినియోగపరుస్తున్నదని ఆరోపించారు. మా గొంతు నొక్కె హక్కు పోలీసులకు ఏ మాత్రం లేదని సిద్ధరామయ్య అన్నారు. ప్రధాని మోడీ, వివాదాస్పద సీఏఏలకు వ్యతిరేకంగా ఓ పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారని ఆరోపిస్తూ పాఠశాల హెడ్ మాస్టర్, ఆ స్కూల్ విద్యార్థి తల్లిని జిల్లా పోలీసులు అరెస్టు చేసి దేశద్రోహం కేసు మోపిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఇద్దరికి కర్నాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ను మంజూరు చేయడంతో వారు జైలు నుంచి విడుదలయ్యారు.