Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా
- అసెంబ్లీలో తీర్మానానికి ప్రయత్నిస్తా
కడప: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్నార్సీ విషయంలో అవసరమైతే తన పదవి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. శనివారం కడపకు వచ్చిన అంజాద్ బాషాకు పౌర సెగ తగిలింది. అంజాద్ బాషాను స్థానికులు, ముస్లింలు, తదితరులు అడ్డగించారు. అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదనీ, అవసరమైతే ఉపముఖ్యమంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానని అంజద్ఖాన్ చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఎన్నార్సీ, సీఏఏ విషయాన్ని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ దష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉపముఖ్యమంత్రి హామీతో ఆందోళనకారులు శాంతించి వెనక్కి తగ్గారు. కాగా, సీఏఏకు అనుకూలంగా పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఓటు వేసిన విషయం తెలిసిందే. సీఏఏకు మద్దతు పలికినప్పటికీ.. ఎన్నార్సీని మాత్రం అనుమతించేది లేదని జగన్ స్పష్టం చేసిన విషయమూ విదితమే. కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో వైసీపీ చేరొచ్చని వార్తలు ఇటీవల వినబడుతున్నాయి. అయితే అసెంబ్లీలో 151 సీట్లు గెలిచిన తాము ఎన్డీయేతో కలవబోమని అంజద్ చెప్పారు. భవిష్యత్తులోనూ బీజేపీ చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.