Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆధార్ లింక్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్'ను ప్రవేశపెట్టే యోచనలో ఈసీ
న్యూఢిల్లీ : '''నేను చెన్నైలో ఉండడం వల్ల మా ఊరికి వెళ్లి ఎన్నికల్లో ఓటేయలేకపోయాను ఆఫీస్లో బాగా వర్క్ ఉండడంతో నేను కూడా ఓటింగ్లో పాల్గొనలేకపోయాను.. ఒక్క ఓటు కోసం అంత దూరం ఏం వెళ్తాంలే..''' ఇవీ ఏ ఎన్నికల సమయంలోనైనా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి నోట వినిపించే మాటలు.. ఇటువంటి వారు కూడా సొంత గ్రామాలు, పట్టణాలకు వెళ్లకుండా తాము ఉన్న ప్రాంతాల్లోనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసే పనిలో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్తుంటారు. ఎన్నికల సమయంలో కుదిరిన వారు ఓటింగ్కు వస్తారు, లేకుంటే లేదు. దీనివల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆధార్ లింక్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ను తీసుకొచ్చే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. దీని ద్వారా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఆఖరుకు విదేశాల్లో ఉన్నా కూడా తమ ఓటు ఎక్కడ ఉందన్న దానితో పనిలేకుండా ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ ఈ సిస్టమ్ను అభివృద్ధి చేసే పనిలో ఉందని అధికారులు తెలిపారు. వచ్చే నెలల్లో దీనికి సంబంధించిన మోడల్ను సంస్థ.. ఈసీ ముందుంచనుంది. అది ఆమోదం పొందితే ఈ ఏడాది చివరికిగానీ, వచ్చే ఏడాది మొదటికిగానీ నమూనా సిద్ధమౌతుందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ఒక జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ నమూనా ఎన్నికల సంఘం ఆమోదం పొందిన తర్వాత ఎన్నికల చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందనీ, దీనికోసం న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రది స్తామని చెప్పారు. ఓటర్ కార్డుతో ఆధార్ లింకింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ లింకింగ్ పూర్తయిన తర్వాతనే రెండంచెల ఓటింగ్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.