Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులపై పోలీసుల దాడి వీడియో విడుదల
- రీడింగ్ హాల్లోకి వెళ్లి మరీ.. చదువుకుంటున్న స్టూడెంట్స్పై లాఠీచార్జి
- సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టిన జామియా కోఆర్డినేషన్ కమిటీ
న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల క్రితం జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్సిటీలో.. సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్న సందర్భంలో వారిపై పోలీసులు లాఠీచార్జి జరిపిన విషయం తెలిసిందే. దీనికి సంబందించిన విడీయో బయటకు వచ్చింది. ఆ కీలక వీడియోను జామియా కో-ఆర్డినేషన్ కమిటీ తాజాగా బయటపెట్టింది. దీంతో విద్యార్థులపై పోలీసుల దమనకాండపై సాక్ష్యాధారం లభించినట్టయ్యింది. సీఏఏకు వ్యతిరేకంగా గత డిసెంబర్ 15న జామియా వర్సిటీలో నిరసనలు, ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో వర్సిటీ మైదానంలో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేసి టియర్గ్యాస్ను సైతం ప్రయోగించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు వర్సిటీ లోపలికి విద్యార్థులపై దాడికి దిగారు. ఇందులో భాగంగా ఓల్డ్ రీడింగ్ హాల్లోకి ప్రవేశించి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి వారిని చితకబాదిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో అక్కడ విద్యార్థులను పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తాము కేవలం చదువుకుంటున్నామని విద్యార్థులు పుస్తకాలను చూపెట్టినప్పటికీ ఖాకీలు మాత్రం కనికరించలేదు. దొరికినవారిని దొరికినట్టు దారుణంగా కొట్టారు. మరికొందరు విద్యార్థులు పోలీసుల దాడికి భయపడి బల్లల కింద నక్కి దాక్కొని తమను తాము రక్షించుకొనే ప్రయత్నాలు చేయడం ఆ వీడియోలో ఉన్నది. అయినప్పటికీ వారిని బయటకు లాగి మరి పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పోలీసులు దాడితో రీడింగ్హాల్ వాతావరణం భయానకంగా తయారయ్యింది. అప్పటి నిరసనల్లో విద్యార్థులు, నిరసనకారులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టామనీ, ఎలాంటి దాడులకు దిగలేదని పోలీసులు చెప్పిన మాటలు పూర్తి అసత్యాలని తాజా వీడియోతో స్పష్టమైంది. దీంతో విద్యార్థులపై పోలీసులు దమనకాండపై సర్వత్రా విర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సహా ఆ పార్టీ ఎంపీ శశిథరూర్లు ఖాకీల దుశ్చర్యను తప్పుబట్టారు.