Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సంక్షోభం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది : మూడీస్
- వృద్ధిరేటు 6.6శాతం నుంచి 5.4 తగ్గింపు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్థిక సంక్షోభం తాము ఊహించినదానికన్నా చాలా ఎక్కువగా ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ 'మూడీస్' తాజాగా వ్యాఖ్యానించింది. గత రెండేండ్లుగా ఆర్థిక గమనాన్ని పరిశీలిస్తే, ఇప్పుడున్న ఆర్థిక మందగమనం అంత త్వరగా పోయేలా లేదని, బయటపడే అవకాశాలు కనపడటం లేదని 'మూడీస్' తాజా నివేదిక పేర్కొన్నది. 2019-20 వృద్ధిరేటు అంచనాల్ని 6.6శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ నెలకొన్న పరిస్థితులకన్నా, దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లే సంక్షోభానికి ప్రధాన కారణాలని నివేదిక అభిప్రాయపడింది. కరోనా వైరస్ (కోవిడ్-19) చైనా ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపనుందనీ, ఇది అంతర్జాతీయంగా వివిధ దేశాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనీ వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించినట్టు తెలిపింది. తాము ఇంతముందు ఊహించిన దానికంటే నెమ్మదిగా ఆర్థిక వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. తాజా అంచనాల ప్రకారం.. 2020లో 5.4శాతం, 2021లో 5.8 శాతం జీడీపీ వృద్ధి వుంటుందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను కూడా సవరించినట్టు మూడీస్ పేర్కొంది. 2020లో జీ-20 దేశాల సమిష్టి ఆర్థిక వృద్ధి 2.4శాతం, 2021లో 2.8 శాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. చైనా జీడీపీ వృద్ధి సవరించిన అంచనాలు 2020లో 5.2 శాతం, 2021లో 5.7 శాతంగా ఉంటుందని అంచనావేసింది. కరోనా భయాందోళనల నేపథ్యంలో ఈ మొదటి త్రైమాసికంలో చైనాతో పాటు పలు దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమవుతాయని తెలిపింది. అయితే రెండో త్రైమాసికం వచ్చేనాటికి అంతర్జాతీయంగా సాధారణ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.