Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రోజుకు రు.33 కన్నా తక్కువ సంపాదించే వారిని పేదలుగా గుర్తించే వివాదాస్పద 'టెండూల్కర్ పేదరిక రేఖ' భావనను నిటి ఆయోగ్ టాస్క్ఫోర్స్ గట్టిగా సమర్ధించింది. నిరుపేదరికంపై జరిపే పోరులో సాధిస్తున్న ప్రగతిని ఈ భావన సూచిస్తుందని టాస్క్ఫోర్స్ తన అధ్యయన నివేదికలో అభిప్రాయపడింది. టెండూల్కర్ పేదరిక రేఖ అంటే ప్రభుత్వ ప్రయోజనాలను పంపిణీ చేసే లబ్దిదారులను గుర్తించేందుకు ఉద్దేశించినది కాదని టాస్క్ఫోర్స్ తెలిపింది. పేదరిక రేఖ అన్నది దేశంలో పేదరికాన్ని గుర్తించేందుకు ప్రాతిపదిక కాదని వివరించింది. దీనికి బదులుగా పేదలను గుర్తించేందుకు బీపీఎల్ (పేదరిక రేఖ దిగువ) వున్న వారి జనగణన రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి సామాజిక, ఆర్థిక కులగణను తాజాగా ప్రభుత్వం 2011లో నిర్వహించింది. అయితే వ్యక్తుల మధ్య వైరుధ్యాన్ని గుర్తించేందుకు ప్రాతిపదిక ఏమిటన్న అంశంపై ఈ నివేదిక ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వ ప్రయోజనాలను పంపిణీ చేయటానికి లబ్దిదారులను గుర్తించటానికి బదులుగా నిరుపేదరికంపై కొనసాగిస్తున్న పోరులో ప్రగతిని అంచనా వేసేందుకు ఈ కొత్త పేదరిక రేఖ భావన ఉపయోగపడుతుందన్న వాస్తవంపై దృష్టి సారించేందుకు వీలుగా తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని టాస్క్ఫోర్స్ తన నివేదికలోపేర్కొంది. 'టెండూల్కర్ పేదరిక రేఖపై వస్తున్న ప్రధాన విమర్శ.. దీని ఆదాయ పరిమితి అత్యంత తక్కువగా వుందన్న అంశంపై.. అంత తక్కువ స్థాయిలో ఆదాయ పరిమితిని నిర్ధారిస్తే ఎంతమంది లభ్ది దారులను గుర్తించగలమన్న చెప్పటం కష్టసాధ్యమవుతుంది. ఇందులో ఇప్పటికే అనేక మంది సంతృప్త స్థాయికి చేరుకుని వుంటారు. మరికొంత మంది త్వరలోనే చేరుకునే దశలో వుంటారు. పేదలను గుర్తించే ప్రక్రియలో ఇది కేవలం స్వల్పంగా మాత్రమే ఉపయోగపడుతుంది' అని ఈ నివేదిక వివరించింది. 2004-05 నాటి జీవన ప్రమాణాల స్థాయి, కొనుగోలు శక్తి వంటి అంశాల ఆధారంగా పేదరికాన్ని లెక్కించేందుకు ప్రధాని ఆర్థిక సలహా మండలి, జాతీయ గణాంకాల కమిషన్కు గతంలో చైర్మెన్గా వ్యవహరించిన సురేష్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నాడు ప్రపంచ వ్యాప్తంగా పేదరిక లెక్కింపునకు ఒక వ్యక్తికి ఒక డాలర్ ఆదాయాన్ని ఆదాయ ప్రాతిపదికగా పరిగణిస్తున్న విషయాన్ని దృష్టిలోవుంచుకుని ఈ కమిటీ 'టెండూల్కర్ పేదరిక రేఖ'ను ప్రతిపాదించింది.