Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలో..
చెన్నై : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోలీసుల దమనకాండను నిరసిస్తూ చెన్నైలో మహిళలు చేస్తున్న నిరసనలు ఉధృతంగా సాగాయి. చిన్నారులు, మహిళలతో సహా వందలాది మంది నిరసనకారులు వాషర్మెన్పేట్లోని లాలగుండలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. నిరసనల్లో భాగంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. నిరసన వేదిక వద్ద ఒక ముస్లిం జంటకు వివాహం జరిగింది. వందలాది మంది నిరసనకారుల సమక్షంలో ఈ పెండ్లి తంతు జరిగింది. అనంతరం నూతన వధూవరులు 'నో సీఏఏ, నో ఎన్పీఆర్, నో ఎన్నార్సీ' అని ఇంగ్లీషు, తమిళంలో రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. '' నేను వధవును అంగీకరిస్తాను. కానీ, సీఎఎ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను కాదు'' అని నవ వరుడు అయిన షహన్షా అన్నారు. పెళ్లికూతురుగా వస్త్రాలంకరణలో ఉన్న నవ వధువు సుమైయా కూడా సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శుక్రవారం నాటి హింసాకాండలో పోలీసుల దాడికి గురైన వారిలో సుమైయా కూడా ఉన్నారు. నిరసనల్లో ఒక్కటైన జంటకు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, నిరసనకారులు అభినందనలు తెలిపారు. వివాహ తంతు ముగిసిన తర్వాత ఆ నవజంట పౌర నిరసనలను కొనసాగించింది. కాగా, మదురై, తిరువారుర్, తంజావూర్, పెరంబలూర్, త్రిచిలతో పాటు పలు జిల్లాల్లో సోమవారం ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.