Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లతో పాటు నిరుద్యోగ సమస్య, పీఎస్యూల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. మహారాష్ట్రలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) కదం తొక్కింది. నవీముంబయిలో జరిగిన నిరసన మార్చ్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న సీపీఐ(ఎం) మాజీ ఎంపీ సుభాషిణీ అలీ..డీవైఎఫ్ఐ కార్యకర్తల నిరసనలకు గొంతు కలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులకు పోలీసులు అనేక అడ్డంకులను సృష్టించారు. నిరసన జరుగుతున్న బేలాపూర్ గ్రామంలో వందలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారీకేడ్లు, బలగాలతో డీవైఎఫ్ఐ కార్యకర్తలను నిలువరించడానికి పోలీసులు యత్నించారు. అయినప్పటికీ ఏ మాత్రం సహనం కోల్పోకుండా డీవైఎఫ్ఐ కార్యకర్తలు తమ నిరసనను తెలియజేశారు. '' ఆదివారం నుంచి మేము నిరసనను ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పోలీసుల నుంచి మాకు అడ్డంకులు ఎదురయ్యాయి. మొదటి రోజు ఉరన్లో, సోమవారం వహాల్ వద్ద, ఇప్పుడు ఇక్కడ. ఏది ఏమైనా మేం మా నిరసన మార్చ్ను విజయవంతంగా పూర్తి చేశాం'' అని డీవైఎఫ్ఐ మహారాష్ట్ర సెక్రెటరీ, ఆలిండియా జాయింట్ సెక్రెటరీ ప్రీతీశేఖర్ అన్నారు.