Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ రాకతో గరిబోళ్లకు కష్టాలు
- మురికివాడల ప్రజల్ని తరలిస్తున్న గుజరాత్ ప్రభుత్వం
గాంధీనగర్ : మురికివాడలు కనిపించకుండా గోడలు కట్టిన గుజరాత్ ప్రభుత్వం, నేడు ఏకంగా మురికివాడల్నే తరలించడానికి సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన (ఈనెల 24, 25) నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్లో చేపడుతున్న చర్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. పేదలు, మురికివాడలు, పశువులు ట్రంప్ కంట పడకుండా గుజరాత్ ప్రభుత్వం ఇంతకు ముందు చేపట్టిన 'గోడకట్టుడు' వ్యవహారం విమర్శలపాలైంది. తాజాగా మొతెరా ప్రాంతంలో (పటేల్ క్రికెట్ స్టేడియంకు సమీపంలో) మురికివాడల నుంచి ప్రజలను ఖాళీ చేయించేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు.
మంగళవారం గడువు...సోమవారం నోటీసులు
పటేల్ స్టేడియంకు సమీపంలో మురికివాడల్ని ఖాళీ చేయించేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమైంది. మంగళవారంలోగా వేరేచోటకు వెళ్లిపోవాలని సోమవారం(ఫిబ్రవరి 17న) 45 కుటుంబాలకు నోటీసులివ్వటం స్థానిక ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. అక్కడున్న పాన్ షాప్ దుకాణాల్ని బలవంతంగా మూసేయించుతున్నారు. కుక్కలు, ఇతర పశువుల్ని బంధించి వేరే చోటకు తరలిస్తున్నారు.
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్దార్ పటేల్ (మోతేరా) స్టేడియం దాకా 'గోడకట్టుడు' పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం స్థానిక ప్రజల్ని మున్సిపల్ అధికారులు వివిధ రకాలుగా బెదిరిస్తూ, వేరే చోటకు పంపిస్తున్నారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారుల్ని మీడియా స్పందనకోరగా, ''అదంతా మాకు తెలియదు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకే దుకాణాల్ని మూయిస్తున్నాం. ఇక్కడున్నవారికి కూడా నోటీసులు ఇచ్చా''మని చెప్పారు.
నమస్తే ట్రంప్ కార్యక్రమం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24న గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు ! ఈసందర్భంగా అహ్మదాబాద్లో జరిగే రోడ్డు షోలో ప్రధాని మోడీ, ట్రంప్లు పాల్గొననున్నారు. మోతేరాలోని నూతన క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించి, అక్కడ జరిగే సభలో ట్రంప్ ప్రసంగించనున్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోడీ, గుజరాత్ సీఎం విజరు రూపానీ సహా ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు.
కాళ్లీ చేయాలని నోటీసులు
వెంటనే ఇక్కడ్నుంచి ఉన్నపళంగా అందరూ ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. మేమంతా ఇక్కడ 22ఏండ్లుగా ఉంటున్నాం. మోతేరా స్టేడియంకు ట్రంప్ వస్తున్నారని, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.
- తేజ మేడా, నిర్మాణరంగ కార్మికుడు
'మీ ఇష్టమున్న చోటకు వెళ్లండి'
వెంటనే ఖాళీచేయాలంటే ఎక్కడికి పోవాలి? అని అడిగితే, 'మీ ఇష్టమున్న చోటకు వెళ్లండి' అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఇక్కడుంటున్న ప్రతి కుటుంబంలో కనీసం నలుగురున్నారు. వీళ్లంతా ఎక్కడి వెళ్లాలి?
- పంకజ్ దామోర్, డ్రైవర్
ఈ 'గిఫ్ట్' ఆయనకే అంకితం
అక్కడ అమెరికాలో సంగతేమోగాని.. ఇక్కడ ఇండియాలో మాత్రం 'హౌడీ మోడీ' అని ఓ వారం పది రోజులు హౌరెత్తిపోయింది. ఇది 2019 సెప్టెంబరు నాటి మాట! హౌస్టన్లో భారతీయులందర్నీ పోగేసి ట్రాంప్గారికి ఓట్లేయించేందుకు ట్రంప్ ద్వారా మోడీగారు పడ్డ తిప్పలవి. ఒకసారి గిఫ్ట్ ఇస్తే తీరేంత 'కురచ' ప్రేమ కాదు మోడీ - ట్రంప్ది. అందుకే సరిగ్గా ఐదు నెలలు కాకముందే అక్కడ ట్రంప్ దొర గెలవడం కోసం ఇక్కడ సొంత రాష్ట్ర రాజధానిలో ఇంకో 'లక్ష మంది' హాజరవుతారనే పేర సభ జరుగుతోంది.
కొద్దినెలల క్రితం మోడీ అమెరికాలోని హౌస్టన్ నగరానికి వెళ్ళినప్పుడు 'హౌడీ.. మోడీ' పేరుతో ఓ కార్యక్రమాన్ని 50 వేల మందితో అట్టహాసంగా జరిపారు. అందులో మోడీ, ట్రంప్ ఇద్దరూ మాట్లాడారు. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశంలోని భారతీయులు ట్రంప్కే ఓటువేసేలా ప్రభావితం చేయటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ వేదికకు కొంతదూరంలో పోటీగా మరో సభ మోడీకి వ్యతిరేకంగా జరిగినా.. భారతదేశంలోని కార్పొరేట్ మీడియా దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నది వేరే సంగతి.
కాగా, ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన భారతదేశ పర్యటనలో అహ్మదాబాద్, ఢిల్లీని సందర్శించనున్నారు. ట్రంప్ అహ్మదాబాద్లో కారులో వెళ్ళేదారి వెంట ఉన్న గుడిసెల ప్రాంతం కనపడకుండా 'గరీబీ ఛుపావో' అన్నట్టు గోడను కడుతున్నారు. గోడల మీద ఉమ్మివేయకుండా పాన్షాపులను మూసివేశారు. ఆ దారిలో ఓ ప్రాంతంలో నివసించే 45 కుటుంబాలను ఖాళీ చేయించారు.
అహ్మదాబాద్లోని క్రికెట్ స్టేడియంలో లక్ష మందితో 'నమస్తే ట్రంప్' అనే కార్యక్రమం జరిపి ఆయన మన్ననలు పొందాలని మోడీ తాపత్రయపడుతున్నారు. ఈ మీటింగ్ ద్వారా కూడా రేపు అమెరికాలోని భారతీయులు ట్రంప్కి ఓటువేసే వాతావరణం ఏర్పడుతుంది. స్వామీజీకి భక్తుడు సమర్పించుకుంటున్న కానుక ఇది. ఇది భారతీయ ప్రజలకు భారంగా మారనున్నది. మనం 'నమస్తే ట్రంప్' అంటే ఆయన మనకు శఠగోపం పెట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నది.