Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సాధారణ సమయాల్లో వైద్య, జీవిత బీమా చేయించుకోవాలని ఇన్సూరెన్సు ఏజెంట్లు తమ వెంటపడ్డా పట్టించుకోని వినియోగదారులు.. ఒక్కసారిగా వాటి మీద దృష్టి సారించారు. కరోనా నేపథ్యం లో తమ జీవితాలకు బీ(ధీ)మా చేయిం చుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ నెలలో వైద్య, జీవిత బీమా అమ్మకాల్లో 40 శాతం పెరుగుదల కనిపించడమే దీనికి నిదర్శనం. కోవిడ్-19 కలవరంతో గడిచిన నెల రోజుల్లోనే వైద్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) అమ్మకాల్లో 35 శాతం నుంచి 40 శాతం, జీవిత బీమాలో 20 శాతం వరకు పెరిగినట్టు 'పాలసీ బజార్' తెలిపింది. ఇది బీమాలను విక్రయించే ఒక ఆన్లైన్ పోర్టల్. ఆర్థిక సంవత్సరం చివరి నెల (మార్చి)లో సాధారణంగానే జీవిత బీమా అమ్మకాలు మిగిలిన నెలలతో పోల్చితే కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే అవి మరీ గడిచిన నెల రోజుల్లో మాత్రం మరింత పెరిగాయి. జనవరితో పోలిస్తే మార్చిలో తమ అమ్మకాలు 50 శాతం పెరిగాయని డిజిట్ ఇన్సూరెన్స్ తెలిపింది. భారత్లో ఈ నెల మొదటివారం నుంచి కోవిడ్-19 కేసులు నమోదు, ఉధృతి పెరిగాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలూ ప్రత్యేకించి కరోనాను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన పాలసీలను తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే విషయమై.. 'మేము నెలకు రూ. 39 లక్షల వరకు బీమా చేయిస్తాం. మా నియంత్రణ పరిధి రూ. 50 లక్షల మేర ఉంటుంది. ఈనెలలో అదీ చేరుకున్నాం' అని డిజిట్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ మార్కెటింగ్ చీఫ్ వివేక్ చతుర్వేది తెలపడం గమనార్హం. అయితే ఆన్లైన్లోనే బీమా అమ్మకాలు పెరుగుతున్నాయి. మరోవైపు సాంప్రదాయక బీమా సంస్థలైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా ఏఐఏ, రిలిగెర్ వంటి పాలసీల అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతున్నది. దాదాపు పది, పదిహేను రోజులుగా బీమా ఏజెంట్లు బయటకు వెళ్లడానికి ఆస్కారం లేకపోవడం, ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తున్న తరుణంలో ఆన్లైన్ వేదికగా ఉన్న బీమా సంస్థల అమ్మకాలే పెరుగుతున్నాయి.దీనిపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి డాక్టర్ ఎస్.ప్రకాశ్ మాట్లాడుతూ.. గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాదిలో తమ బీమా అమ్మకాలు 50 శాతం దాకా (మార్చిలో) తగ్గాయని తెలిపారు. లాక్డౌన్ కారణంగా తమ ఏజెంట్లు ఎక్కడివారక్కడే ఉండిపోయారని అన్నారు. ఏదేమైనా ఈ నెలలోనే తాము తీసుకొచ్చిన 'స్టార్ నావెల్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్ పాలసీ' ద్వారా కోవిడ్-19 పాజిటివ్ సోకిన వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదే విషయమై పాలసీ బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్ స్పందిస్తూ.. 'పాలసీబజార్ ద్వారా విక్రయించే బీమాలకు ఎలాంటి ఆరోగ్య, భౌతిక పరీక్షలు లేకుండానే చేస్తున్నాం. దీని ద్వారా వినియోగదారులకు మెడికల్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి వేచి చూసే అవసరం లేదు. పాలసీ చేసుకోవాలనుకునే వ్యక్తి సుమారు రూ. 2 కోట్ల దాకా ఫోన్లోనే మెడికల్ టెస్ట్లు చేయించుకుని పాలసీ పొందవచ్చు. అందుకే పాలసీ తీసుకోవాలనుకునేవాళ్లు ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు' అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య బీమాలు అమ్మేందుకు మెడికల్ టెస్ట్లు చేయించడం కష్టంతో కూడుకున్న పని అనీ, అందుకే తామూ ఫోన్ల ద్వారా ఆయా వ్యక్తుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేసుకుని పాలసీలు అందజేస్తున్నామని క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ జనరల్ మేనేజర్ పంకజ్ అరోరా తెలిపారు.