Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు దేశ ప్రజలందరూ తనను క్షమించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడం కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. కరోనా కారణంగా దేశంలో 21 రోజుల లాక్డౌన్ సాగుతున్న తరుణంలో ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచమంతా ప్రమాదకర కరోనా గురించే చర్చ జరుగుతున్నదని అన్నారు. 'ఈరోజు మన దేశమే కాదు.. ప్రపంచమంతా ఒకే ఒక్క విషయం కదలాడుతోంది. అదే ప్రాణాంతకమైన కరోనా వ్యాధి సృష్టించిన భయంకర కష్టం. ఇటువంటి సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు. ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను. అయితే నన్ను క్షమించాల్సిందిగా దేశప్రజలందరినీ, ముఖ్యంగా పేదలను కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది' అని మోడీ తెలిపారు. కరోనాపై యుద్ధానికి ఇంతకు మించిన మరోమార్గం లేదని అన్నారు. ప్రజలంతా భావోద్వేగాలను కాకుండా సామాజిక దూరాన్ని పాటించాలని మోడీ తెలిపారు. కరోనా యుద్ధమంటే జీవితానికి చావుకు మధ్య జరిగే యుద్ధమనీ, ఇందులో మనం గెలవాలని చెప్పారు.