Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హెచ్పీసీఎల్ రిఫైనరీ విస్తరణలో 50 శాతం 'మ్యాన్పవర్' కుదింపు
- తూర్పునౌకాదళంలో క్యాజువల్ కార్మికుల నిలిపివేత...
- వాల్తేరు డివిజన్ 17 వేల మందిలో 2700 మందే విధుల్లో
- పోర్టు ట్రస్ట్ ఆపరేషన్స్పై నీలినీడలు
విశాఖ : విశాఖ పారిశ్రామిక రంగాన్ని 'కరోనా' కుదేలు పడేలా చేసింది. స్టీల్ప్లాంట్, పోర్టు ట్రస్ట్ వంటి పలు కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉత్పత్తిని కుదించుకుంటుండగా, రక్షణ రంగం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తమ సంస్థలోని క్యాజువల్ కార్మికులపై వేటు వేసేదాకా వెళ్లాయి. కొన్ని అత్యవసర పనుల మేరకే సిబ్బందిని విని యోగించుకునే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. భారత్లో కరోనా రాష్ట్రాల నుంచి రాష్ట్రాల కే విస్తరించడం, దేశమంతటా పారిశ్రామిక షట్డౌన్కు ప్రధాని పిలుపునివ్వడం, రాష్ట్ర ప్రభు త్వాలు దీన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. ఈ ప్రభావం విశాఖ వంటి చోట్ల కీలక, మౌలిక పారి శ్రామిక రంగాల్లో ఉత్పత్తులపై తీవ్రంగా పడింది.
కరోనా ఎఫెక్ట్!
విశాఖ స్టీల్ప్లాంట్లో రోజుకు 19 వేల హాట్ మెటల్ (ఉక్కు ద్రావకం) ఉత్పత్తి జరగాల్సి ఉండగా, తాజాగా పది వేల టన్నులకే ఉత్పత్తిని పరిమితం చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వైజాగ్ పోర్టులో ట్రాఫిక్ ఆపరేషన్స్ నిలిచిపోయి రోజుకు రూ.87 లక్షలు పోర్టుకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. హెచ్పీసీఎల్లో క్యాజువల్ కార్మికులు రెండు వేల మందిని విధుల నుంచి నిలిపేశారు. మొత్తంగా శ్రామికుల జీవనాన్ని 'కరోనా' దెబ్బకొట్టిందా? ఆ పేరుతో పాలకులు సరైన చర్యలను తీసుకోలేకపోయారా? అనే చర్చ విశాఖ మహాపారిశ్రామిక నగరంలో తాజాగా జరుగుతోంది. వివిధ పరిశ్రమల్లో పరిస్థితి ఇలా ఉంది.
హెచ్పీసీఎల్లో ఏం జరిగింది?
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్్)లో ఉత్పత్తిని ఎక్కడా నిలుపుదల చేయలేదు. కాంట్రాక్టు, అప్రంటీస్లను విధుల నుంచి నిలిపివేశారు. ఫిజికల్ డిస్టెన్స్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం చెప్తోంది. విధుల్లో ఉండే సిబ్బందికి భద్రత, మాస్క్లు, శానిటైజర్లను హెచ్పీసీఎల్ యాజమాన్యం అందజేసింది. 1,100 మంది ఆఫీసర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్లకు మూడు షిఫ్టులనూ అమలు చేస్తోంది. మెయిటైనెన్స్, సాధారణ పరిపాలనల్లోగల 120 మంది ఉద్యోగుల విషయంలో రోజు తప్పించి రోజు డ్యూటీలు వేశారు. దీనివల్ల ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం ఉండదని హెచ్పీసీఎల్ వర్గాలు భావిస్తున్నాయి. మల్కాపురం హెచ్పీసీఎల్ ప్రాంగణం లో రూ.26 వేల కోట్లతో చేపట్టిన విశాఖ రిఫైనరీ మోడరన్ ప్రాజెక్టు (వీఆర్ఎంపీ) విస్తరణ పనుల్లో పది వేల మంది కార్మికులు పనిచేస్తుండే వారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ప్రాజెక్టు నుంచి 50 శాతం మందిని అంటే ఐదు వేల మంది క్యాజువల్ కార్మికులను గత సోమవారం నుంచి ఆపేయడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వీరంతా రోడ్డున పడ్డారు.
నౌకాదళంలో రెండు వేల మంది
క్యాజువల్ కార్మికుల నిలుపుదల
దేశ రక్షణ రంగ విభాగం విశాఖలోని తూర్పునౌకాదళంలో పలు 'కరోనా' చర్యలు తీసుకున్నారు. రక్షణ రంగం అయినందున కొంత మేర పరిమితంగానే అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దేశానికే భద్రత ఇవ్వాల్సిన రంగం అయినందున కొంతమేరే 'షట్డౌన్' అమల్లో ఉందని చెబుతున్నారు. గేట్ల ముందు (వచ్చి, వెళ్లే వారికి) హ్యాండ్ వాష్ వంటి కనీస చర్యలు అమలు చేస్తున్నారు. పెళ్లి కాని వాళ్లందరినీ (నావికులను) నౌకల్లోనే ఉంచేశారు. కుటుంబాలు ఉన్న వారందరినీ క్వార్టర్స్లో ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సగానికి పైగా నావికులు నౌకల్లో విధుల్లోనే ఉండిపోయారు. నౌకాదళంలో నిత్యం వివిధ పనులను నిర్వహించే క్యాజువల్ కార్మికులు రెండు వేల మందిని పనులకు ఆపేసినట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.