Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దేశంలో వేయి దాటిన పాజిటివ్ కేసులు: కేంద్రం
- లాక్డౌన్ నేపథ్యంలో ఐదుగురు వలసకూలీలు మృతి
- ప్రాణాంతక వైరస్పై ఇస్రో పోరు !
- మహారాష్ట్రలో ఎనిమిదో మరణం
- ప్రపంచవ్యాప్తంగా 33 వేల 509 మంది బలి.. ఏడు లక్షల మందికి పైగా సోకిన వైరస్
- కోవిడ్..19తో స్పెయిన్ రాకుమారి కన్నుమూత
న్యూఢిల్లీ : కరోనా కోరల్లో చిక్కుకున్న వారి సంఖ్య దేశంలో పెరుగుతున్నది. ఇప్పటివరకూ 29మంది ప్రాణాలు కోల్పో యారు. పాజిటివ్ కేసుల సంఖ్య 1116కి చేరింది. వీరిలో 98 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 196, కేరళలో 182, కర్నాటకలో 83, తెలంగాణలో 67, గుజరాత్లో 58, ఉత్తరప్రదేశ్లో 55 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం.. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రెండెంకలకు చేరుకోవటంతో..ఇక్కడి ప్రజానీకాన్నిభయాందోళనకు గురి చేస్తున్నది.
ఐదుగురు వలస కూలీల మృతి
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లోని వలస కూలీలు పనులు లేక తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది కాలినడకనే సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే .. ఢిల్లీలోని తుగ్లకాబాద్లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న రణ్వీర్ సింగ్ (39) లాక్డౌన్ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని మోర్నే జిల్లాలో ఉన్న తన సొంత గ్రామానికి బయలుదేరాడు. ఢిల్లీ, ఆగ్రా హైవేలో కైలాష్ టర్నింగ్ వద్ద అతడికి ఛాతి నొప్పి వచ్చింది.
రంగంలోకి ఇస్రో !
కరోనా వైరస్పై ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తేలికగా ఉపయోగించుకోగలిగే విధంగా ఉండే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి తమ వంతు సాయం అందిస్తామని ఇస్రో తెలిపింది. ఈ విషయాన్ని ఇస్రో డైరెక్టర్ ఎస్.సోమ్నాథ్ వెల్లడించారు.
మహారాష్ట్రలో ఎనిమిదో మరణం
మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 196కు చేరింది. ఈ వైరస్ బారినపడి తాజాగా బుల్దానా జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ముంబయి, థాణే ప్రాంతాల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 107 చేరడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటు పుణేలోనూ 37 కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. కేరళలోనూ కోవిడ్-19 విజృంభిస్తూనే ఉంది. తాజాగా నమోదైన 39 పాజిటివ్ కేసుల్లో 20 మంది విదేశాల నుంచి వచ్చిన వారేనని రాష్ట్ర సర్కారు ప్రకటించింది.
అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధికంగా 1.24 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మూడురోజుల్లోనే రెట్టింపు స్థాయిలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిసున్నది. అలాగే, 2300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 195 దేశాల్లో 7 లక్షల మందికి కరోనా సోకగా.. చనిపోయిన వారి సంఖ్య 32,200లకు చేరింది. ఇక ఇటలీలోనూ కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. ఇక్కడ వైరస్ బారినపడ్డవారి సంఖ్య 93 వేలకు చేరింది. 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్లో 80 వేల మంది కరోనా సోకగా.. ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటి తర్వాత జర్మనీ (59వేల కేసులు, 460 మరణాలు), ఇరాన్ ( 38,500 కేసులు, 2,700 మరణాలు), ఫ్రాన్స్ (38 వేల కేసులు, 2,320 మరణాలు) దేశాలున్నాయి. కాగా, పాకిస్థాన్లో 1,600 మందికి కోవిడ్-19 సోకగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనాతో స్పెయిన్ రాకుమారి మృతి
కోవిడ్-19 బారినపడి స్పెయిన్ రాకుమారి ప్రాణాలు కోల్పోయారు. యువరాణి మరియా థెరిసాకు కరోనా సోకడంతో మృతిచెందినట్టు ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డి బోర్బన్ వెల్లడించారు. ప్రపంచంలో ఒక రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కరోనా వల్ల మరణించడం ఇదే తొలిసారి. కాగా, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్కు కరోనా ప్రబలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు సైతం కోవిడ్-19 సోకిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ప్రస్తుతం కోలుకున్నట్టు అధికారులు ప్రకటించారు.