Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎప్పుడేం అవసరమొస్తుందోనని నగదును తీసుకుంటున్న ఖాతాదార్లు
- ఇలాగే కొనసాగితే మార్కెట్లో కరెన్సీ సమస్య : ఆర్థికవిశ్లేషకులు
న్యూఢిల్లీ : కరోనా భయాలు...దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ఖాతాదార్లు పెద్దమొత్తంలో తమ సొమ్మును విత్డ్రా చేస్తున్నారు. గత 15రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.53వేల కోట్ల రూపాయలు నగదు రూపంలో వివిధ బ్యాంకుల నుంచి ఖాతాదారులు తీసేసుకున్నారు. ఖాతాదార్లు ఇంతపెద్ద మొత్తంలో నగదు తీసుకోవటం గత 16 నెలల్లో ఇదే మొదటిసారి. లాక్డౌన్ కారణంగా ఇంటి అవసరాలు, ప్రతిఖర్చు నగదు రూపంలో ఉండటంతో చేతిలో డబ్బు ఉండాలన్న ఆలోచనతో అనేకమంది జాగ్రత్తపడుతున్నారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ సంస్థల ద్వారా నిత్యావసర సరుకులు ఆర్డర్ ఇచ్చినా, ఆ సేవలు అందే పరిస్థితి ఇప్పుడు కనపడటం లేదు. సరుకుల డెలివరీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందన్న కారణంతో ఈకామర్స్ సంస్థలు ఆర్డర్లు స్వీకరించటం లేదు.
నోట్ల చెలామణికి సంబంధించి ఆర్బీఐ ఇటీవల వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. పండుగలు, ఎన్నికల సమయంలో నగదు విత్డ్రాయల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడుంది. గత 15 రోజులుగా పెద్దమొత్తంలో నోట్లను బ్యాంకుల ద్వారా సరఫరా చేశాం. మార్చి 13నాటికి దేశవ్యాప్తంగా ప్రజల చేతుల్లో చెలామణి అవుతున్న నగదు మొత్తం రూ.23లక్షల కోట్లు. డిజిటల్ లావాదేవీలను కూడా కలుపుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం.
నగదు సంక్షోభానికి దారితీస్తుంది...
బ్యాంకులు ఆన్లైన్ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నా, అందుకు అనుకూల వాతావరణం లేదని, నిత్యావసర సరుకులన్నీ నగదురూపంలో కొనుగోలు చేస్తున్నారని జాతీయ బ్యాంకుల చీఫ్ ఎకానమిస్ట్ ఎస్కె.ఘోష్ కేంద్రానికి తెలియజేశారు. నగదు కోసం డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని కేంద్రానికి రాసిన నోట్లో ఆయన తెలియజేశారు. బ్యాంకుల్లో ఓ వైపు డిపాజిట్లు పడిపోవటం, మరోవైపు నగదు విత్డ్రాయల్స్ పెరగటం...నగదు సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.