Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-దేశంలో 1,308 మందికి ప్రబలిన కోవిడ్-19
- వైరస్తో 38కు చేరిన మృతులు..
- ప్రపంచవ్యాప్తంగా 7.64 లక్షల మంది బాధితులు, 35 వేల మరణాలు
- స్పెయిన్, ఇటలీ దేశాల్లో ఆగని మృత్యుఘోష
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) కల్లోలం సృష్టిస్తున్నది. భారత్లోనూ ఈ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లోనే 92 కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1,308కు చేరింది. ఇప్పటివరకూ 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 114 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 215 మందికి కరోనా సోకగా.. వారిలో 9 మంది చనిపోయారు. మరో 34 మంది కోలుకున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో మరో 12 కొత్త కేసులతో పాటు పుణేలో ఒకరు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు సంగ్లీ జిల్లాలో రెండేండ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 25 మంది వైరస్ బారినపడ్డారనీ అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు ఇటీవలే దుబారు నుంచి వచ్చారు. వారికి కరోనా ప్రబలినట్టు ఇదివరకే నిర్ధారణ కాగా, వారి కుంటుంబంలోని అందిరికి వైరస్ సోకినట్టు తాజాగా పరీక్షల్లో వెల్లడైందని వైద్యులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శానిటైజింగ్ చర్యలు చేపట్టారు. తాజాగా నమోదైన ఐదు కొత్త కరోనా కేసులతో కలిపి కర్నాటకలో పాజిటివ్ కేసుల సంఖ్య 88కి చేరింది. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకూ 88 మందికి వైరస్ ప్రబలింది. అధికంగా గౌతమ్బుద్ద నగర్లో 36, మీరట్లో 13 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఢిల్లీలో 72, తెలంగాణలో 70, గుజరాత్ 69, తమిళనాడు 67, రాజస్థాన్లో 62 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో మరో 32 పాజిటివ్ కేసులు..
కేరళలో మరో 32 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో 17 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. కాసర్గఢ్లో 17 మంది, కన్నూర్లో 11 మంది, వయనాడ్లో ఇద్దరు, ఇడుక్కి లో ఇద్దరికి కరోనా ప్రబలిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 234 చేరిందనీ, వీరిలో 20 మంది కోలుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,57,253 మంది పరిశీలనలో ఉండగా.. వీరిలో 623 మంది ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారని వివరించారు.
సీఆర్పీఎఫ్ 24 గంటల హెల్ప్లైన్ సెంటర్ !
కరోనా వైరస్ సంక్షోభంపై సీఆర్పీఎఫ్ పోరు సాగించడానికి సిద్ధమైంది. తమ సైనికులతో పాటు వారి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవడానికి 24 గంటలు సేవలు అందించే సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. సీఆర్పీఎఫ్లోని 23 విభాగాలను ఏకీకృతం చేస్తూ ఈ కేంద్రం ద్వారా సేవలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్, ల్యాండ్లైన్, వాట్సాప్ల ద్వారా సేవలు అందించటంతో పాటు, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆయా జోన్లలోని అధికారులు వెంటనే దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
స్పెయిన్, ఇటలీ దేశాల్లో కోవిడ్-19 విజృంభన
ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడ్డవారి సంఖ్య 7,41,907 చేరగా.. 35,337 మంది ప్రాణాలు కోల్పోయారు. 1.57లక్షల మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో స్పెయిన్లో 812 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 7,340 మంది మృతి చెందారు. 85 వేల మందికి ప్రబలింది. ఇటలీలోనూ కరోనా మృత్యుఘోష ఆగడం లేదు. అక్కడ ఇప్పటి వరకు లక్ష మందికి కరోనా సోకగా.. 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, అమెరికాలో వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్నది. ఒకే రోజు 518 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇప్పటికే 1.50లక్షల మంది వైరస్ బారినపడగా.. 2,600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్లోనే 60 వేల మందికి కోవిడ్-19 సోకగా.. వేయి మందికి పైగా మృతి చెందారు. న్యూయార్క్ తర్వాత కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మిచిగాన్, మసాచ్సెట్స్, ఫ్లోరిడా, వాషింగ్టన్లలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణాలో 61 కేసులు
రాష్ట్రంలో మరొకరు కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో ఇద్దరు మరణించినట్టు వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా ఆరు కేసులు రాగా మొత్తం 61 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇది వరకే ఒకరు కోలుకొని డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. సోమవారం డిశ్చార్జి అయిన 13 మందితో కలుపుకుని మొత్తం 14 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.